వ్యవసాయ అప్పుల్లో దేశంలోనే రెండో స్థానంలో ఏపీ
ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్ర రైతుల అప్పులు రూ.2,69,415 కోట్లు
లోక్సభలో వెల్లడించిన ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి
సన్న, చిన్నకారు రైతుల రుణాలను మాఫీ చేసే ప్రతిపాదనేదీ లేదని స్పష్టీకరణ
సాక్షి,అమరావతి: రాష్ట్రంలోని రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అత్యధిక వ్యవసాయ అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ రైతులు దేశంలోనే రెండో స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి మన రాష్ట్ర రైతుల అప్పులు రూ.2,69,415.73 కోట్లకు చేరాయి. ఈ విషయాన్ని సోమవారం లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. దేశంలో రూ.లక్ష కోట్లకు పైగా వ్యవసాయ రుణాలు గల రైతులు ఆరు రాష్ట్రాల్లో ఉన్నారని తెలిపారు. దేశంలో అత్యధిక వ్యవసాయ అప్పులు గల రైతులు తమిళనాడులో ఉండగా, రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రైతులు ఉన్నారని వివరించారు.
ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల రైతులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఉపశమనం కల్పించేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న రైతుల అప్పులను ఆర్థిక పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు. అయితే, సన్న, చిన్నకారు రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేసే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని పంకజ్ చౌదరి స్పష్టంచేశారు.


