చెయ్యేరు నదిలో ఇసుక అక్రమ రవాణాకు క్యూ కట్టిన టిప్పర్లు
సాక్షి టాస్క్ఫోర్స్: చెయ్యేరును పచ్చతోడేళ్లు చెరబట్టాయి. పగలు రాత్రి తేడా లేకుండా వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం బాలరాజుపల్లె సమీపంలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నదుల్లో పొక్లెయిన్లు, హిటాచీలతో తోడకూడదని ఆదేశాలున్నా లెక్క చేయడం లేదు. ప్రత్యేకంగా నదిలోకి దారి నిర్మించి టిప్పర్లతో ఇసుక తరలిస్తున్నారు. పచ్చ ముఠాలకు ఓ మైనార్టీ నాయకుడు సహకారం అందించడంతో చెయ్యేరు నుంచి తమిళనాడు, కర్నాటకకు భారీగా ఇసుక తరలిపోతోంది.

వారం క్రితం సుండుపల్లె వద్ద ఇసుక టిప్పర్ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో స్థానికులు మృతదేహాలతో రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఘటన జరిగిన రోజు టిప్పర్లను పోలీసులు స్వాధీనం చేసుకోగా మర్నాటి నుంచి యధావిధిగా అక్రమ రవాణా సాగిపోతోంది. బాలరాజుపల్లె నుంచి రాయచోటి రింగ్రోడ్డు, మదనపల్లె మీదుగా ఇసుక బెంగళూరుకు తరలుతుండగా.. పీలేరు మీదుగా మరికొన్ని ప్రాంతాలకు చేరవేస్తున్నారు. చెయ్యేరు పరీవాహక ప్రాంతంలో రాజంపేట నుంచి రైల్వేకోడూరు, రేణిగుంట మీదుగా తమిళనాడుకు ఇసుక తరలిపోతోంది. విచ్చలవిడిగా ఇసుక తవ్వకాల వల్ల భారీ అగాథాలు ఏర్పడటంతో భూగర్భ జలాలు ఇంకిపోతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


