మీడియా, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలకు నో ఎంట్రీ
సాంఘిక సంక్షేమ శాఖ సర్క్యులర్పై వెల్లువెత్తుతున్న విమర్శలు
సాక్షి, అమరావతి: పారదర్శకతకు పాతరేస్తూ చంద్రబాబు ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకుంది. ఇటీవల ప్రభుత్వ వసతి గృహాల్లో సౌకర్యాలలేమి, ఆహార నాణ్యతలోపం, విద్యార్థుల అనారోగ్యం వంటి ఘటనలు ప్రభుత్వ డొల్లతనాన్ని బట్టబయలు చేస్తున్నాయి. వాటిని మీడియా, విపక్ష నేతలు, విద్యార్థి సంఘాలు వెలుగులోకి తెస్తుండటంతో కలవరపడిన ప్రభుత్వం ఏకంగా హాస్టల్లోకి వారికి నో ఎంట్రీ అని సర్క్యులర్ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ జారీ చేసిన సర్క్యులర్ (మెమో) ఉపసంహరించుకోవాలనే డిమాండ్ బలపడుతోంది.
హాస్టళ్లలో విద్యార్థుల భద్రత, గోప్యతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, ఆ పేరుతో మీడియా, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, సామాజిక సంస్థల ప్రతినిధులు ముందస్తు అనుమతి లేకుండా వాటిలోకి వెళ్లకూడదనే ఆంక్షలు పెట్టడం ప్రజాస్వామ్య పర్యవేక్షణను అడ్డుకోవడమేననే వాదన విన్పిస్తోంది. ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ను అడ్డుపెట్టుకుని హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, కుల వివక్ష, అవినీతి, నాసిరకం ఆహారం, మౌలిక వసతుల లోపాలు, అధికారుల నిర్లక్ష్యం వంటి అంశాలు బయటపడకుండా చేసే ప్రమాదం ఉంది.
ప్రభుత్వ నిధులతో నడిచే సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పనితీరును పర్యవేక్షించి ప్రశ్నించే అధికారం మీడియాకు, ప్రజలకు ఉందనే స్పృహను ప్రభుత్వం విస్మరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో పారదర్శకత, జవాబుదారీతనం మరింత బలోపేతం కావాలి గానీ, ఆంక్షల పేరుతో మూసివేయడం సమంజసం కాదని ఆంధ్రప్రదేశ్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అన్నారు. సర్క్యులర్ను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.


