సమృద్ధిగా మూలధనం, లిక్విడిటీ
మెరుగుపడుతున్న అసెట్ క్వాలిటీ, లాభదాయకత
ఏఐ సైబర్ దాడుల ముప్పులు పొంచి ఉన్నాయి
ఆర్థిక స్థిరత్వ నివేదికలో రిజర్వ్ బ్యాంక్
ముంబై: అంతర్జాతీయంగా ఎదురవుతున్న షాక్లను దీటుగా ఎదుర్కొనేలా ఆర్థిక సంస్థల బ్యాలెన్స్ షీట్లు మెరుగ్గా ఉన్న నేపథ్యంలో దేశీ ఎకానమీ పటిష్టంగా ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. మూలధనం, లిక్విడిటీ సమృద్ధిగా ఉండటం, అసెట్ క్వాలిటీ మెరుగుపడుతుండటం, లాభదాయకత స్థిరంగా ఉండటంలాంటి అంశాల దన్నుతో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్సీబీ) సురక్షితంగా ఉన్నాయని పేర్కొంది.
మంగళవారం విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్)లో రిజర్వ్ బ్యాంక్ ఈ విషయాలు వెల్లడించింది. షాకుల్లాంటివి ఏవైనా తలెత్తినా, తట్టుకుని నిలబడే సత్తా బ్యాంకింగ్ సిస్టమ్కు ఉన్నట్లు స్ట్రెస్ టెస్టుల్లో వెల్లడైనట్లు వివరించింది. అటు నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల అసెట్ క్వాలిటీ, లాభదాయకత కూడా మెరుగుపడుతోందని వివరించింది.
‘భారీ స్థాయిలో అంతర్జాతీయంగా షాక్లు ఎదురవుతున్నప్పటికీ భారత ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ చెప్పుకోతగ్గ స్థాయిలో పటిష్టంగా నిలుస్తున్నాయి. పటిష్ట వృద్ధి, ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటం, నిధుల లభ్యత పుష్కలంగా ఉండటంలాంటి అంశాలు స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో తోడ్ప డుతున్నాయి’ అని ఎఫ్ఎస్ఆర్ ముందుమాటలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
నివేదికలోని మరిన్ని విశేషాలు..
⇒ సైబర్ ముప్పులపరంగా చూస్తే సమీప భవిష్యత్తులో ఏఐ ఆధారిత సైబర్ దాడుల రిస్కులు చాలా కీలకంగా ఉండబోతున్నాయి.
⇒ ఉద్రిక్తతలు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు కొనసాగుతున్నప్పటికీ ఉత్పాదకతపరంగా ఏఐతో ప్రయోజనాలు ఒనగూరవచ్చన్న ఆశాభావంతో గ్లోబల్ ఎకానమీ పటిష్టంగానే ఉంది.
⇒ భారతీయ బ్యాంకుల్లో స్థూల మొండిబాకీలు పలు దశాబ్దాల కనిష్ట స్థాయి 1.8%కి తగ్గాయి. పరిస్థితులు ఎంత దిగజారినా 2028 మార్చి ఆఖరు నాటికి 1.9%కి మాత్రమే పెరగొచ్చు.


