ఇదీ హోలీ గిఫ్ట్‌ అంటే.. ఉద్యోగులకు రూ.34 కోట్లు.. | Prudent CMD Sanjay Shah GIFTS shares worth Rs 34 CRORE to employees and personal staff | Sakshi
Sakshi News home page

ఇదీ హోలీ గిఫ్ట్‌ అంటే.. ఉద్యోగులకు రూ.34 కోట్లు..

Mar 14 2025 9:09 PM | Updated on Mar 15 2025 8:39 AM

Prudent CMD Sanjay Shah GIFTS shares worth Rs 34 CRORE to employees and personal staff

హోలీ పండుగ సందర్భంగా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు మిఠాయిలు, బహుమతులు ఇవ్వడం సాధారణమే. అయితే ఈ హోలీ సందర్భంగా ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రమోటర్ సంజయ్ షా కేవలం రంగులకే పరిమితం కాకుండా.. తన సిబ్బందికి రూ.34 కోట్ల విలువైన 1,75,000 ఈక్విటీ షేర్లను బహుమతిగా ఇస్తున్నారు.

దాదాపు 650 మంది ఉద్యోగులు, వ్యక్తిగత సిబ్బంది దీంతో ప్రయోజనం పొందనున్నారు. ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ లిమిటెడ్ సీఎండీ సంజయ్ షా ఈ ఉదార చర్యతో వ్యాపారంలో 25వ ఏట అడుగుపెట్టారు. లబ్ధిదారుల్లో కంపెనీ ఉద్యోగులే కాకుండా ఆయన ఇంట్లో పనిచేసే సహాయకులు, డ్రైవర్లు వంటి వ్యక్తిగత సిబ్బంది కూడా ఉన్నారు.

ఉద్యోగులకు రూ.కోట్ల షేర్లు ప్రకటించిన ప్రూడెంట్ ప్రమోటర్ సంజయ్ షా ఈయనే..

ఈ సందర్భంగా సంజయ్ షా మాట్లాడుతూ.. 'ఇది కేవలం షేర్ల బదలాయింపు మాత్రమే కాదు. ఈ ప్రయాణంలో ఉద్యోగులుగా మాత్రమే కాకుండా సహచరులుగా నాకు అండగా నిలిచిన వారికి ఇవి నేను సమర్పించే హృదయపూర్వక ధన్యవాదాలు. మీ నిస్వార్థ సహకారాలు, విశ్వసనీయత, విధేయత అమూల్యమైనవి’ అని పేర్కొన్నారు.

సంజయ్ షా తన నిర్ణయాన్ని కంపెనీకి తెలియజేశారు. ఇందుకోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)తో సహా అవసరమైన రెగ్యులేటరీ అనుమతులను ప్రూడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ పొందింది. కాగా ఉద్యోగులకు రూ.కోట్ల షేర్లు ప్రకటించిన ప్రూడెంట్ అధినేతపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement