
ఎన్ఎస్ఈలో ప్రవేశపెట్టేందుకు సెబీ సై
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ ఇకపై నెలవారీ ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టనుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతించినట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. విద్యుత్ ధరల హెచ్చుతగ్గులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు హెడ్జింగ్ టూల్స్గా వీటిని మార్కెట్ వర్గాలు వినియోగించుకోనున్నట్లు పేర్కొంది. తద్వారా విద్యుత్ రంగంలో తగిన ధరల సంకేతాలతోపాటు.. పెట్టుబడుల ప్రోత్సాహానికి వీలు కలగనున్నట్లు తెలియజేసింది.
విద్యుదుత్పత్తితోపాటు.. ప్రసారం, పంపిణీ, రిటైల్ తదితర విభాగాలలో పెట్టుబడులు పెరిగే వీలున్నట్లు వివరించింది. ఎలక్ట్రిసిటీ డెరివేటివ్స్ ఎకోసిస్టమ్ మరింత విస్తరించేందుకు తాజా అనుమతి సహకరించగలదని, ఇందుకు ఇది తొలి అడుగు అని ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ పేర్కొన్నారు. నియంత్రణ సంస్థల అనుమతులకు అనుగుణంగా త్రైమాసిక, వార్షిక తదితర దీర్ఘకాలిక కాంట్రాక్టులు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు. కాగా.. ఎలక్ట్రిసిటీ డెరివేటివ్స్ను ప్రవేశపెట్టేందుకు సెబీ నుంచి గ్రీన్సిగ్నల్ లభించినట్లు గత వారం ఎంసీఎక్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
కొత్త యూపీఐ విధానం
ఇన్వెస్టర్ల పరిరక్షణ లక్ష్యంగా సెబీ కొత్త యూపీఐ మార్గదర్శకాలను తప్పనిసరి చేసింది. ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించే అన్ని రిజిస్టర్డ్ ఇంటరీ్మడియరీలకు ఇవి వర్తిస్తాయని స్పష్టం చేసింది. సెక్యూరిటీల మార్కెట్లో ఆర్థిక లావాదేవీలకు వీలు, వీటి భద్రత లక్ష్యంగా తాజా యూపీఐ మెకనిజంకు తెరతీసినట్లు సెబీ తెలియజేసింది. వెరసి 2025 అక్టోబర్ 1నుంచి యూపీఐ చెల్లింపుల మెకనిజం అమల్లోకి రానున్నట్లు సెబీ చీఫ్ తుహిన్ కాంతా పాండే వెల్లడించారు. ఇటీవల కాలంలో అన్రిజిస్టర్డ్ సంస్థలు ఇన్వెస్టర్లను మోసగించడం ఎక్కువైన నేపథ్యంలో సెబీ తాజా చర్యలు చేపట్టింది. ధృవీకరించిన, భద్రతతోకూడిన చెల్లింపుల చానల్కు తెరతీయడం ద్వారా సెక్యూరిటీల మార్కెట్లో ఇన్వెస్టర్ల పెట్టుబడులకు రక్షణ కల్పించనున్నట్లు పాండే వివరించారు.