జామ్నగర్: దాదాపు 48 ఏళ్ల వయసున్న ఏనుగు 'మణికీ' జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎన్నో సంవత్సరాలుగా కాలికి తీవ్ర వైకల్యం, వయోభారంతో వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మణికీని అత్యాధునిక వైద్య చికిత్స కోసం గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న ‘వంతారా’కు తరలించారు. ఇకపై ఆ ఏనుగుకు దీర్ఘకాలిక వైద్య సంరక్షణతో పాటు శాశ్వత ఆవాసం కూడా కల్పించనున్నారు.
మణికీ ముందు ఎడమ కాలులో చాలా కాలంగా ఉన్న వైకల్యం కారణంగా నడక తీవ్రంగా దెబ్బతింది. దీనికి తోడు ఇన్ఫెక్షన్తో కూడిన గాయాలు, ఒక కంటిలో చూపు మందగించడం, డీహైడ్రేషన్, శరీర బలహీనత వంటి సమస్యలు ఏనుగు ఆరోగ్యాన్ని మరింత క్లిష్టంగా మార్చాయి.
అస్సాంలో చికిత్స కోసం తరలిస్తుండగా మణికీ తీవ్ర నొప్పితో కుంటుకుంటూ రహదారిపై నడుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. జంతు సంక్షేమ కార్యకర్తలు, పౌరులు, పలు సంస్థలు ఆ ఏనుగుకు తక్షణ వైద్య సహాయం అందించాలని ప్రభుత్వాలను కోరాయి. పిటిషన్లు దాఖలు చేయడంతో మణికీ పరిస్థితి జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
మణికీకి ప్రత్యేక వైద్య చికిత్స అవసరమని గుర్తించిన దాని యజమాని రుచి చేతియా, బాధిత వన్యప్రాణుల రక్షణ, సంరక్షణ కోసం సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి లేఖ రాసి వంతారాకు తరలించేందుకు అనుమతి కోరారు. అనంతరం కమిటీతో పాటు అస్సాం, గుజరాత్ ప్రభుత్వాల నుంచి అవసరమైన అనుమతులు లభించడంతో ఆ ఏనుగును సురక్షితంగా జామ్నగర్కు తరలించారు.
అత్యాధునిక చికిత్స.. దీర్ఘకాలిక సంరక్షణ
వంతారాలోని అత్యాధునిక వెటర్నరీ ఆసుపత్రిలో మణికీకి సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి, దీర్ఘకాలిక చికిత్స అందించనున్నారు. ప్రారంభ దశలో నొప్పి నివారణ చికిత్స, హైడ్రోథెరపీ, ఆక్యుపంక్చర్, ఇన్ఫెక్షన్తో ఉన్న గాయాలకు ప్రత్యేక వైద్యం, పోషకాహార పునరుద్ధరణ వంటి చర్యలు చేపట్టనున్నట్లు వంతారా ప్రతినిధులు తెలిపారు.
అలాగే కాలుపై ఒత్తిడి తగ్గేలా మెత్తని నేల, సహజమైన మట్టి వాతావరణం, నీటిలో విశ్రాంతి తీసుకునేందుకు కుంటలు, సహజంగా ఆహారం వెతుక్కునే అవకాశం, ఇతర ఏనుగుల సాన్నిధ్యం వంటి అనుకూల వాతావరణాన్ని కూడా కల్పించనున్నారు. దీంతో మణికీ ఆరోగ్య పునరుద్ధరణకు అవసరమైన శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
వంతారా ప్రతినిధులు మాట్లాడుతూ, మణికీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రత్యేక వైద్య పర్యవేక్షణ అత్యవసరమని నిర్ధారణ అయిందన్నారు. చికిత్స ప్రక్రియలో సహకరించిన సంబంధిత ప్రభుత్వ శాఖలకు, సుప్రీంకోర్టు కమిటీకి, అలాగే యజమాని రుచి చేతియాకు కృతజ్ఞతలు తెలిపారు.
మణికీ రక్షణ కథనం ప్రజల చొరవ, జంతు సంక్షేమ సంస్థల కృషి, ప్రభుత్వాల సమన్వయం కలిసి ఒక జంతువు జీవితాన్ని ఎలా మార్చగలవో చూపించింది. ఎన్నో రోజులుగా బాధతో సాగిన ఆ ఏనుగు ప్రయాణానికి ఇప్పుడు ముగింపు పలుకుతూ, చికిత్స, సంరక్షణ, ప్రశాంతతతో కూడిన కొత్త జీవితానికి వంతారా వేదికగా మారింది.
వంతారా గురించి..
వంతారా అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ స్థాపించిన ప్రపంచ స్థాయి జంతు సంక్షేమ, సంరక్షణ కేంద్రం. గాయపడిన, అనారోగ్యంతో ఉన్న అడవి జంతువులను రక్షించడం, వైద్య చికిత్స అందించడం, పునరావాసం కల్పించడం, దీర్ఘకాలిక సంరక్షణ అందించడం దీని ప్రధాన లక్ష్యం. ప్రపంచంలోనే అతిపెద్ద ఏనుగుల ఆసుపత్రుల్లో ఒకటిగా ఉండటమే కాకుండా అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ వన్యప్రాణి ఆసుపత్రులను నిర్వహిస్తూ, శాస్త్రీయ విధానాలతో జంతు సంరక్షణ కార్యక్రమాలను చేపడుతోంది. ప్రభుత్వాలు, వివిధ భాగస్వామ్య సంస్థలతో కలిసి వన్యప్రాణుల సంరక్షణకు వంతారా సేవలందిస్తోంది.


