ఆలయం వెలుపల అనంత్ అంబానీ
రూ.27.5 కోట్ల విలువైన సేవా కార్యక్రమాలపై హామీ
తిరుమల: ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిపై మరోసారి తన భక్తిని చాటుకున్నారు. టీటీడీకి సుమారు రూ.27.5 కోట్ల విలువైన పలు సేవా కార్యక్రమాలను చేపడతామని హామీ ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణ, గోసంరక్షణ, భక్తులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాల కల్పన లక్ష్యంగా ఈ సేవలను అందిస్తామని తెలిపారు. అనంత్ అంబానీ శనివారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. తలనీలాలు సమర్పించుకున్నారు.
ఆదివారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు, శేష వస్త్రం అందజేసి సత్కరించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆయన శ్రీవారి పలు సేవా కార్యక్రమాలకు విరాళాలు ప్రకటించారు.
భక్తులకు కాలుష్య రహిత రవాణా సౌకర్యం కల్పించేందుకు టీటీడీకి 25 విద్యుత్ బస్సులను అందజేస్తామని, వీటిని నడిపే 50 మంది డ్రైవర్ల వేతన భత్యాలను కూడా తమ సంస్థ భరిస్తుందని వెల్లడించారు. విద్యుత్ బస్సుల కోసం తిరుమలలో ఆధునిక విద్యుత్ చార్జింగ్ స్టేషన్ ను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.


