4,800 మంది బాధితులు.. ఆ ఐటీ కంపెనీపై చర్యలు తీసుకోండి | NITES complaint to labour ministry on DXC Tech for onboarding delay | Sakshi
Sakshi News home page

4,800 మంది బాధితులు.. ఆ ఐటీ కంపెనీపై చర్యలు తీసుకోండి

Jun 30 2024 9:01 AM | Updated on Jun 30 2024 12:18 PM

NITES complaint to labour ministry on DXC Tech for onboarding delay

ఐటీ కంపెనీ డీఎక్స్‌సీ టెక్నాలజీపై ఐటీ ఉద్యోగుల యూనియన్‌ కార్మిక శాఖకు ఫిర్యాదు చేసింది. 4,800 మందికి పైగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ను ఆన్‌బోర్డ్ చేయడంలో జాప్యం చేసిన డీఎక్స్‌సీ టెక్నాలజీపై చర్యలు తీసుకోవాలని పుణెకు చెందిన ఐటీ ప్రొఫెషనల్ యూనియన్ నాన్యూసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను కోరింది.

రెండేళ్లకు పైగా కొనసాగిన ఈ జాప్యం ఫ్రెషర్లకు తీవ్ర ఇబ్బందులను కలిగించిందని ఎన్ఐటీఈఎస్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా ఒక ప్రకటనలో తెలిపారు. కంపెనీ హామీలను నమ్మిన ఫ్రెషర్లలో చాలా మంది ఇతర ఉద్యోగ ఆఫర్లను తిరస్కరించారని యూనియన్ తెలిపింది. ప్రస్తుతం ఈ అభ్యర్థులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, ఇంకా ఉద్యోగంలోకి చేర్చుకోకపోవడంతో భవిష్యత్తుపై స్పష్టత లేదని యూనియన్‌ పేర్కొంది.

ఆన్‌బోర్డింగ్‌ జాప్యంపై ఐటీ ఎంప్లాయీస్‌ గతంలోనూ పలు కంపెనీలపై కార్మికశాఖకు ఫిర్యాదు చేసింది. 2,000 మందికి పైగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్లను ఆన్‌బోర్డ్ చేయడంలో పదేపదే జాప్యం చేస్తోందంటూ ఇన్ఫోసిస్‌పై దర్యాప్తు జరపాలని గత జూన్‌ నెల ప్రారంభంలో కోరింది. అంతకు ముందు 2023 జూలైలో టీసీఎస్ 200 మందికి పైగా లేటరల్ రిక్రూట్మెంట్లను ఆలస్యం చేస్తోందని కార్మిక శాఖకు యూనియన్ ఫిర్యాదు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement