మిల్లెట్‌ ఫుడ్స్‌కు పీఎల్‌ఐ: కేంద్ర ఆహార శుద్ధి శాఖ కార్యదర్శి  | millet based foods Centre second PLI scheme for processing | Sakshi
Sakshi News home page

మిల్లెట్‌ ఫుడ్స్‌కు పీఎల్‌ఐ: కేంద్ర ఆహార శుద్ధి శాఖ కార్యదర్శి 

Sep 6 2023 4:05 PM | Updated on Sep 6 2023 4:51 PM

millet based foods Centre second PLI scheme for processing - Sakshi

మిల్లెట్‌ ఆధారిత ఆహార ఉత్పత్తుల శుద్ధి పరిశ్రమకు కేంద్ర సర్కారు రెండో విడత ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్‌ఐ) ప్రకటించనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆహార శుద్ధి శాఖ కార్యదర్శి అనితా ప్రవీణ్‌ తెలిపారు. ఈ పథకం ఆమోదం దశలో ఉందని, దీని కింద రూ.1,000 కోట్ల ప్రోత్సాహకాలు కల్పించనున్నట్టు చెప్పారు. కోల్‌కతాలో ఓ కార్యక్రమం సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. (ఇషా అంబానీకి కొత్త బాధ్యతలు: కుమార్తెపై నీతా నమ్మకం అలాంటిది!)

ఆహారోత్పత్తుల శుద్ధి పరిశ్రమకు మొదటి దశ పీఎల్‌ఐ కింద రూ.800 కోట్లు ప్రకటించగా, గత ఆర్థిక సంవత్సరం నుంచి ఇది ఆరంభమైనట్టు చెప్పారు. మొదటి దశలో 30 సంస్థల నుంచి దరఖాస్తులు వచ్చాయని, పూర్తి స్థాయిలో సబ్‌స్క్రయిబ్‌ అయినట్టు వెల్లడించారు. ఇప్పుడు రెండో విడత కింద మరో రూ.1,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆహార శుద్ధి యూనిట్లకు సాయం అందించేందుకు వీలుగా కేంద్రం నుంచి రూ.10,900 కోట్ల నిధులకు ఆమోదం లభించినట్టు చెప్పారు. దీన్నుంచి రూ.800 కోట్లను మొదటి దశ పీఎల్‌ఐ కింద మిల్లెట్‌ ఆధారిత ఉత్పత్తులకు ఇస్తున్నట్టు తెలిపారు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రోఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పథకం కింద ఆహార శుద్ధి పరిశ్రమలోని చిన్న యూనిట్లకు సాయం చేస్తున్నట్టు అనితా ప్రవీణ్‌ వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement