డిజిటల్ యుగంలో టీనేజర్లు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో, వారి భద్రతపై ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెటా తన యాప్ (ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మెసెంజర్)లలో కొత్త భద్రతా అప్డేట్స్ను ప్రకటించింది. ఈ మార్పుల ప్రధాన లక్ష్యం టీనేజర్లకు సురక్షితమైన ఆన్లైన్ అనుభవాన్ని అందించడం, తల్లిదండ్రులకు మరింత నియంత్రణ, అవగాహన కల్పించడం.
మెటా తీసుకొచ్చిన ముఖ్యమైన మార్పుల్లో ఒకటి 13+ వయస్సుకు అనుగుణమైన కంటెంట్ సెట్టింగ్స్. దీని ద్వారా టీనేజర్లు తమ వయస్సుకు సరిపోని కంటెంట్ను చూడకుండా పరిమితం చేయడం జరుగుతుంది. ఫీడ్, రీల్స్, గ్రూప్స్ వంటి విభాగాల్లో అనుచిత కంటెంట్ను తగ్గించడం ద్వారా వారికి 'వయసుకు తగిన డిజిటల్ ప్రపంచం' అందించాలనే లక్ష్యం ఉంది.
మెటా ఇప్పుడు కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా ఖాతా వయస్సును గుర్తించే విధానాన్ని అభివృద్ధి చేసింది. కేవలం యూజర్ ఇచ్చిన పుట్టిన తేదీపై ఆధారపడకుండా, ప్రొఫైల్ సమాచారం, పోస్టులు, కామెంట్లు, బయోలు వంటి డేటాను విశ్లేషించి అది మైనర్ ఖాతానా? కాదా? అని అంచనా వేస్తుంది. అంతే కాకుండా, ఫోటోలు.. వీడియోల ఆధారంగా వయస్సును అంచనా వేసే టెక్నాలజీని కూడా ఉపయోగిస్తోంది. ఇది వ్యక్తిని గుర్తించడానికి కాదు, కేవలం సాధారణ వయస్సు అంచనా వేయడానికి మాత్రమే ఉపయోగిస్తామని మెటా స్పష్టం చేసింది.
టీనేజర్ల భద్రత కోసం మరో కీలక అప్డేట్ తల్లిదండ్రులకు ఇచ్చే అలర్ట్స్. ఒక టీనేజర్ తక్కువ సమయంలో పదేపదే ఆత్మహత్య లేదా స్వీయహాని సంబంధిత విషయాలు సెర్చ్ చేస్తే, తల్లిదండ్రులకు వెంటనే సమాచారం పంపబడుతుంది. దీని ద్వారా అవసరమైన సమయంలో సహాయం అందించడానికి అవకాశం ఉంటుంది.
తల్లిదండ్రులు ఇప్పుడు ఒకే చోట తమ పిల్లల సోషల్ మీడియా కార్యకలాపాలను చూడగలుగుతారు. దీనిని 'ఫామిలీ సెంటర్' అంటారు. ఇందులో స్క్రీన్ టైమ్, యాప్ వినియోగం వంటి వివరాలను సులభంగా పర్యవేక్షించవచ్చు. ఇవన్నీ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేయడం జరుగుతోంది.
ఇదీ చదవండి: 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!


