లగ్జరీ ఇళ్ల మెరుపులు | Luxury housing sales increase by 53percent in 2024 | Sakshi
Sakshi News home page

లగ్జరీ ఇళ్ల మెరుపులు

Jan 16 2025 5:20 AM | Updated on Jan 16 2025 7:55 AM

Luxury housing sales increase by 53percent in 2024

2024లో 53 శాతం పెరిగిన విక్రయాలు; 19,700 యూనిట్లు అమ్మకం 

హైదరాబాద్‌లో 70 గృహాల విక్రయం 

న్యూఢిల్లీ: విశాలమైన ఇళ్లు, ప్రీమియం సదుపాయాలు కోరుకునే సంపన్నుల సంఖ్య పెరుగుతుండటంతో దానికి అనుగుణంగా లగ్జరీ ఇళ్లకు డిమాండ్‌ కూడా గణనీయంగా పెరుగుతోంది. 2024లో హైదరాబాద్‌ సహా ఏడు ప్రధాన నగరాల్లో రూ. 4 కోట్లకు పైగా ఖరీదు చేసే లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 53 శాతం ఎగిసినట్లు రియల్‌ ఎస్టేట్‌ సంస్థ సీబీఆర్‌ఈ తెలిపింది. మొత్తం 19,700 యూనిట్లు అమ్ముడైనట్లు వివరించింది. హైదరాబాద్‌లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 2,030 యూనిట్ల నుంచి 70 పెరిగి 2,100 యూనిట్లకు చేరాయి. 

ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో (నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌) అత్యధికంగా 10,500 యూనిట్లను రియల్టీ సంస్థలు విక్రయించాయి. 2023 క్యాలెండర్‌ సంవత్సరంలో రూ. 4 కోట్ల ఖరీదు చేసే లగ్జరీ ఇళ్లు 12,895 అమ్ముడయ్యాయి. కొనుగోళ్లకు నెలకొన్న డిమాండ్‌తో రెసిడెన్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ పటిష్టంగా ఉందని, రాబోయే క్వార్టర్లలోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చని సీబీఆర్‌ఈ చైర్మన్‌ అన్షుమన్‌ మ్యాగజైన్‌ తెలిపారు. మధ్యస్థాయి ప్రాజెక్టుల ఉండే పుణె, చెన్నై తదితర నగరాలు కూడా హై–ఎండ్‌ ప్రాజెక్టుల వైపు మళ్లుతున్నాయని పేర్కొన్నారు. ప్రీమియం ప్రాంతాల్లో ఆధునిక సదుపాయాలు, అసమానమైన సౌకర్యాన్ని అందించే హై–ఎండ్‌ ఇళ్లకు డిమాండ్‌ భారీగా ఉంటోందని క్రిసుమి కార్పొరేషన్‌ ప్రెసిడెంట్‌ ఆకాశ్‌ ఖురానా వివరించారు.  

సీబీఆర్‌ఈ డేటా ప్రకారం.. 
→ రూ. 4 కోట్ల పైబడి ఖరీదు చేసే ఇళ్ల అమ్మకాలు ముంబైలో 4,200 యూనిట్ల నుంచి 5,500 యూనిట్లకు పెరిగాయి.  
→ పుణెలో 400 నుంచి 825 పెరగ్గా, బెంగళూరులో 265 యూనిట్ల నుంచి 50కి పడిపోయాయి. 
→ కోల్‌కతాలో అమ్మకాలు 310 నుంచి 530కి, చెన్నైలో 165 యూనిట్ల నుంచి 275 యూనిట్లకు పెరిగాయి.  

Advertisement
 
Advertisement
Advertisement