
గిగ్ వర్కర్ల సంక్షేమానికి ఊతమిచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లపై 5 శాతం సెస్ వసూలు చేసి వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఇటీవల ఢిల్లీలోని తన నివాసంలో సమావేశమైన అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. సమగ్ర గిగ్ వర్కర్స్ బిల్లును రాష్ట్ర కేబినెట్ ఆమోదం కోసం ప్రవేశపెడతామని తెలిపారు.
ఈ బిల్లు అమల్లోకి వస్తే అమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటో, స్విగ్గీ, ఓలా, ఉబర్, డన్జో సహా 12 ప్రధాన కంపెనీల్లో పనిచేసే కార్మికులకు సామాజిక భద్రతా ప్రయోజనాలు లభిస్తాయి. గిగ్ వర్కర్లు సరుకులను డెలివరీ చేయడానికి లేదా సేవలను అందించడానికి ప్రయాణించిన దూరం ఆధారంగా కొంత మొత్తాన్ని ఈ చట్టం కింద ఏర్పాటు చేయబోయే సంక్షేమ నిధికి మళ్లిస్తామని సీఎం చెప్పారు. కర్ణాటక కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్, ఐటీ అండ్ బయోటెక్నాలజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే, పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్తో ఈమేరకు చర్చించి కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
ప్రతిపాదనలు ఇవే..
ఈ సమావేశంలో గిగ్ కార్మికుల సంక్షేమాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడం; అసంఘటిత రంగంలోని కార్మికులకు సాధారణంగా అందుబాటులో లేని ఆరోగ్య బీమా, విద్యా మద్దతు, ఇతర రక్షణలు వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడం; ఈ-కామర్స్, అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ల ద్వారా గిగ్ వర్కర్లకు చేసే చెల్లింపులపై 5 శాతం సెస్ను బోర్డుకు కేటాయించడం వంటి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సామాజిక భద్రత కోడ్ 2020 నిబంధనలకు అనుగుణంగా సమగ్ర సంక్షేమ పథకాలను నిర్ధారించడానికి ఈ విధానాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు గిగ్ వర్కర్లకు రుణాలు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ఈ మొత్తాన్ని వినియోగిస్తామని స్పష్టం చేశారు. గతంలో ఈ చట్టం కింద ప్రతి లావాదేవీకి 1-2 శాతం సెస్ను ప్రతిపాదించినప్పటికీ అంతర్గత విభేదాల కారణంగా దీని అమలు రెండుసార్లు నిలిచిపోయింది.
ఇదీ చదవండి: క్యాష్యూను క్యాష్ చేసుకునేలా టారిఫ్లు
పారిశ్రామిక వర్గాల ఆందోళన
ఈ ప్రకటన నాస్కామ్, ఐఏఎంఏఐ వంటి పారిశ్రామిక సంస్థల నుంచి విమర్శలకు దారితీసింది. ఇది ఈ-కామర్స్ సంస్థలపై, ముఖ్యంగా ఇప్పటికే తక్కువ మార్జిన్లతో కొట్టుమిట్టాడుతున్న స్టార్టప్లపై భారం మోపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కర్ణాటకలో గణనీయమైన కార్యకలాపాలు కలిగిన అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థల నిర్వహణ వ్యయాలు పెరుగుతాయని తెలిపాయి. తిరిగి వినియోగదారులపై ఈ భారం పడుతుందని అంచనా వేస్తున్నాయి.