న్యూఢిల్లీ: గృహ రుణాల ఈఎంఐల భారం విషయంలో రుణగ్రహీతలకు స్పష్టత ఉండే విధంగా ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ కొత్తగా హైబ్రిడ్ హోమ్ లోన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనితో వడ్డీ రేటు 65 నెలల వరకు స్థిరంగా ఉండేలా లాక్ చేసుకునేందుకు వీలవుతుంది. రుణం తీసుకున్న తొలినాళ్లలో ఈఎంఐల భారం విషంయలో కొంత వెసులుబాటు పొందేందుకు ఇది సహాయకరంగా ఉంటుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది.
ఈ పథకం కింద 39, 52 లేదా 65 నెలల వరకు ఈఎంఐని లాక్ చేసుకోవచ్చని పేర్కొంది. ఫలితంగా కీలకమైన రెపో రేట్లు మారినా ఆ ప్రభావం వాయిదాలపై ఉండదని తెలిపింది. ఉదాహరణకు ఇటీవల వడ్డీ రేట్ల పెరుగుదల ధోరణులను చూస్తే, ఈ పథకం కింద రూ. 1 కోటి గృహ రుణం తీసుకున్న వారికి కనీసం రూ. 3.46 లక్షల వరకు ఆదా అవుతుందని పేర్కొంది. ప్రస్తుతం కోటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణాలపై వడ్డీ రేటు 7.6% నుంచి ప్రారంభమవుతోంది.


