జూలై 1 నుంచి 2% ధరల పెంపు
టాటా వాణిజ్య వాహన ధరలు పైపైకే
న్యూఢిల్లీ: కియా ఇండియా కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే జూలై 1, 2026 నుంచి తమ వాహనాల ధరలను మోడళ్ల వారీగా 2% వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ధరల పెంపు అనేది వేరియంట్లను బట్టి మారుతుందని స్పష్టం చేసింది. ‘పెరుగుతున్న ముడిసరుకు ఖర్చులు, నిర్వహణ వ్యయాల ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే, కస్టమర్లపై పూర్తి భారం పడకుండా ఉండేందుకు పెరిగిన వ్యయంలో చాలా వరకు కంపెనీయే భరిస్తోంది. వినియోగదారులకు అత్యుత్తమ ఉత్పత్తులను, యాజమాన్య అనుభవాన్ని అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం’ అని కియా ఇండియా వివరించింది.
టాటా వాణిజ్య వాహనాలూ ప్రియం
టాటా మోటార్స్ సైతం తమ వాణిజ్య వాహనాల (కమర్షియల్ వెహికల్స్) ధరలను పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. జూలై 1 నుంచి తమ వాహన శ్రేణిపై 2.5 శాతం వరకు ధరల పెంపు ఉంటుందని సంస్థ తెలిపింది. ముడిసరుకుల ధరలు నిరంతరాయంగా పెరుగుతుండటంతో, ఆ ప్రభావాన్ని కొంతవరకు అధిగమించేందుకు ఈ పెంపు తప్పడం లేదని టాటా మోటార్స్ పేర్కొంది.


