ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా ఇండియా, దేశవ్యాప్తంగా తన అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు 2026 జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది.
భారతదేశంలో విక్రయించే అన్ని కియా కార్ల ధరలు 2 శాతం వరకు పెరగనున్నాయి. పెరుగుతున్న ముడిసరుకుల ఖర్చులు, నిర్వహణ వ్యయం పెరగడం వల్లే ఈ ధరల పెంపునకు కారణమని ఈ కొరియన్ సంస్థ చెబుతోంది. ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుంది అనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. ధరల పెరుగుదల మోడల్, వేరియంట్ను బట్టి మారుతాయి.
ప్రస్తుతం, కియా ఇండియా దేశంలో ఎనిమిది విభిన్న మోడళ్లను విక్రయిస్తోంది. కార్నివాల్,ఈవీ6, ఈవీ9 కార్లు కంపెనీ కంప్లీట్ బిల్డ్ యూనిట్గా మన దేశానికి వస్తాయి. స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న మోడళ్లలో సోనెట్, సైరోస్, సెల్టోస్, కారెన్స్ క్లావిస్, కారెన్స్ క్లావిస్ ఈవీ ఉన్నాయి.
ప్రస్తుతం, ఈ మోడళ్ల ధరలు ఎంట్రీ-లెవల్ సోనెట్ కోసం రూ. 7.33 లక్షల నుంచి, టాప్-స్పెక్ క్లావిస్ ఈవీ కోసం రూ. 25 లక్షల వరకు ఉన్నాయి. కార్నివాల్, ఈవీ6, ఈవీ9 ధరలు వరుసగా రూ. 59.45 లక్షలు, రూ. 67.98 లక్షలు, రూ. 1.3 కోట్లుగా ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).


