దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటర్స్ (Tata Motors) మరోసారి కారు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. కంపెనీ తన ప్యాసింజర్ వాహనాల శ్రేణిలోని పెట్రోల్, డీజిల్, సీఎన్జీతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల ధరలను జూలై 1, 2026 నుంచి గరిష్ఠంగా 1.5 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. మోడల్, వేరియంట్ను బట్టి ధరల పెంపు భిన్నంగా ఉండనుంది. కొత్త ధరల జాబితాను జూలై 1న వెల్లడించనున్నారు.
ముడి పదార్థాల ధరలు పెరగడం, తయారీ వ్యయాలు అధికమవడం, కొనసాగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా కంపెనీ తెలిపింది. ఖర్చుల భారాన్ని ఇప్పటివరకు గణనీయంగా సంస్థే భరించినప్పటికీ, దాని ప్రభావంలో కొంత భాగాన్ని ఇప్పుడు వినియోగదారులకు బదిలీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని టాటా మోటార్స్ పేర్కొంది.
ఈ ధరల పెంపు టాటా ప్యాసింజర్ వాహనాల మొత్తం శ్రేణిపై ప్రభావం చూపనుంది. ప్రస్తుతం కంపెనీ పోర్ట్ఫోలియోలో టాటా టియాగో (Tata Tiago), టాటా టైగర్, టాటా పంచ్ (Tata Punch), టాటా నెక్సాన్, టాటా కర్వ్ (Tata Curvv), టాటా హారియర్, టాటా సఫారీ వంటి మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ వెర్షన్లు కూడా ఉన్నాయి. ఇటీవల పరిచయమైన టాటా సియెర్రా (Tata Sierra), సియెర్రా ఈవీ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
టాటా మోటార్స్ ఈ ఏడాదిలో చేపడుతున్న రెండో ధరల పెంపు ఇది. అంతకుముందు ఏప్రిల్ 1 నుంచే కొన్ని వాహనాల ధరలను సంస్థ పెంచింది. మరోవైపు కమర్షియల్ వాహనాల ధరలను కూడా ఏప్రిల్లో 1.5 శాతం వరకు టాటా మోటర్స్ పెంచింది.
ఆటోమొబైల్ రంగంలో పెరుగుతున్న వ్యయాల ప్రభావంతో ఇతర కంపెనీలు కూడా ధరల సవరణలు చేపడుతున్నాయి. మారుతీ సుజుకీ (Maruti Suzuki) జూన్ 1 నుంచి కొన్ని మోడళ్ల ధరలను రూ.30 వేల వరకు పెంచగా, హ్యుందాయ్ మోటర్స్ ఇండియా (Hyundai) కూడా జూన్ నుంచి ధరలను పెంచింది. దీంతో కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం కనిపిస్తోంది.
జూలై 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానుండటంతో, టాటా కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు జూన్ నెలాఖరు లోపు బుకింగ్ లేదా కొనుగోలు పూర్తి చేస్తే ప్రస్తుత ధరల ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ జూన్ నెలలో కొన్ని మోడళ్లపై ప్రత్యేక డిస్కౌంట్లు కూడా అందిస్తోంది.


