జూన్ నెల ముగింపునకు వచ్చేసింది. జూన్ 30 పలు కీలక విషయాలకు గడువు తేదీ. ఎల్పీజీ సబ్సిడీ పొందుతున్న లబ్ధిదారుల ఈ-కేవైసీ నుంచి ఆదాయపు పన్ను శాఖ పరిశీలన (స్క్రూటినీ) నోటీసుల వరకు, అలాగే త్రైమాసిక ముగింపు నేపథ్యంలో వ్యాపారాల జీఎస్టీ, టీడీఎస్ సంబంధిత సన్నాహాల వరకు పలు ముఖ్యమైన గడువులు ఈ నెలాఖరుతో ముగియనున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఆర్థిక నష్టాలు లేదా పరిపాలనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఎల్పీజీ సబ్సిడీ నిలిచిపోయే అవకాశం
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు ప్రతి సంవత్సరం ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటివరకు ధ్రువీకరణ పూర్తి చేయని ఇతర ఎల్పీజీ సబ్సిడీ లబ్ధిదారులు కూడా జూన్ 30లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. లేనిపక్షంలో వారి బ్యాంకు ఖాతాల్లోకి సబ్సిడీ జమ కావడం తాత్కాలికంగా నిలిచిపోవచ్చు. అయితే గ్యాస్ సిలిండర్ బుకింగ్పై ఎలాంటి ప్రభావం ఉండదు. పూర్తి ధర చెల్లించి సిలిండర్ పొందవచ్చు. ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ-కేవైసీ పూర్తి చేసిన లేదా సబ్సిడీకి అర్హులు కాని వినియోగదారులు మళ్లీ ఈ ప్రక్రియ చేయాల్సిన అవసరం లేదు.
ఐటీఆర్ స్క్రూటినీ నోటీసులకు కీలకం
2025-26 ఆర్థిక సంవత్సరానికి దాఖలైన ఆదాయపు పన్ను రిటర్నులపై సెక్షన్ 143(2) కింద స్క్రూటినీ నోటీసులు జారీ చేయడానికి ఆదాయపు పన్ను శాఖకు జూన్ 30 చివరి గడువు. ఇది పన్ను చెల్లింపుదారులు రిటర్న్ దాఖలు చేయాల్సిన గడువు కాదు. కేవలం ఇప్పటికే దాఖలైన రిటర్నులను పరిశీలనకు ఎంపిక చేస్తే నోటీసులు పంపేందుకు శాఖకు ఉన్న చట్టబద్ధమైన చివరి తేదీ మాత్రమే. రిటర్నులో చూపిన వివరాలు, ఫారం 26AS, AIS, TIS, బ్యాంకు లావాదేవీలు లేదా అధిక విలువ గల ఆర్థిక లావాదేవీల మధ్య వ్యత్యాసాలు కనిపిస్తే స్క్రూటినీకి ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఇటీవల కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (CBDT) కూడా జూన్ 30నే ఈ గడువుగా స్పష్టం చేసింది.
వ్యాపారాలకు త్రైమాసిక ముగింపు
జూన్ 30తో 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) ముగియనుంది. దీంతో కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ ఖాతాల పుస్తకాలు, టీడీఎస్, టీసీఎస్ నమోదులు, జీఎస్టీ రికార్డులు, ఇతర చట్టబద్ధమైన లెక్కలను నవీకరించుకోవాల్సి ఉంటుంది. తద్వారా జూలైలో దాఖలు చేయాల్సిన జీఎస్టీ రిటర్నులు, టీడీఎస్/టీసీఎస్ స్టేట్మెంట్లను సకాలంలో సమర్పించేందుకు వీలు కలుగుతుంది.
ఈ గడువులను చివరి నిమిషానికి వాయిదా వేయకుండా ముందుగానే పూర్తి చేస్తే అనవసరమైన జరిమానాలు, సబ్సిడీ జాప్యాలు, పన్ను సంబంధిత ఇబ్బందులను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


