నా జీవితంలో అతిపెద్ద రిస్క్‌.. జియో: ముకేశ్‌ అంబానీ | Jio was the biggest risk of my life.. says Mukesh Ambani | Sakshi
Sakshi News home page

నా జీవితంలో అతిపెద్ద రిస్క్‌.. జియో: ముకేశ్‌ అంబానీ

Jun 26 2025 12:40 AM | Updated on Jun 26 2025 8:09 AM

Jio was the biggest risk of my life.. says Mukesh Ambani

అందరూ వద్దని హెచ్చరించినా నేను వినలేదు.. 

ఒకవేళ విఫలమైనా, దేశానికి మేలు చేసినట్లయ్యేది 

ఇంటర్వ్యూలో ముకేశ్‌ అంబానీ వెల్లడి

న్యూఢిల్లీ: జియో రూపంలో టెలికం రంగంలోకి రీఎంట్రీ చేయడమనేది తన జీవితంలో తీసుకున్న అతి పెద్ద రిస్క్  గా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ అభివర్ణించారు. అత్యంత అధునాతనమైన డిజిటల్‌ టెక్నాలజీకి భారత్‌లో పరిస్థితులు ఇంకా అనువుగా లేవని, ఈ వెంచర్‌ ఆర్థికంగా విఫలమవుతుందని విశ్లేషకులు హెచ్చరించినప్పటికీ వెనక్కి తగ్గలేదని ఆయన చెప్పారు. 

ఒకవేళ విశ్లేషకులు చెప్పినది నిజంగానే జరిగినా కూడా, దేశాన్ని డిజిటల్‌ బాట పట్టించడంలో జియో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో, ఆ మాత్రం రిస్కు తీసుకోవడంలో తప్పు లేదనిపించిందని మెకిన్సే అండ్‌ కంపెనీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ‘మేము ఎప్పుడూ పెద్ద రిస్క్ లే తీసుకున్నాం. మాకు భారీ స్థాయి ముఖ్యం. మేము ఇప్పటి వరకు తీసుకున్న అతి పెద్ద రిస్కు జియోనే. అప్పట్లో మా సొంత డబ్బును ఇన్వెస్ట్‌ చేశాం. నేను 

మెజారిటీ వాటాదారుగా ఉన్నాను. 4జీ మొబైల్‌ నెట్‌వర్క్‌ విస్తరణ కోసం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కోట్ల కొద్దీ డాలర్లను ఇన్వెస్ట్‌ చేస్తున్న క్రమంలో ఈ టెక్నాలజీకి భారత్‌లో అనువైన పరిస్థితులు లేవని, డబ్బంతా వృథా అవుతుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ మా కంపెనీ బోర్డుకు నేను ఒక్కటే చెప్పాను. ఇదంతా మన సొంత డబ్బు. 

మహా అయితే దీనిపై మనకు పెద్దగా ఆదాయం రాకపోవచ్చు. ఫర్వాలేదు. దీనితో దేశాన్ని డిజిటలైజ్‌ చేయొచ్చు. భారత్‌ను సంపూర్ణంగా మార్చివేయొచ్చు. ఆ విధంగా దేశం కోసం రిలయన్స్‌ ఒక గొప్ప మేలు చేసినట్లవుతుంది. అత్యుత్తమ విరాళం ఇచ్చినట్లవుతుంది అన్నాను‘ అని అంబానీ పేర్కొన్నారు. 2016లో ప్రారంభమైన జియో.. నేడు 47 కోట్ల మంది యూజర్లతో, 5జీ, క్లౌడ్, ఏఐ సర్వీసుల్లోనూ కార్యకలాపాలతో టెలికంలో అగ్రస్థానంలో ఉంది.  

ఇంకా ఏమన్నారంటే.. 
→ ప్రపంచం ప్రతి అయిదేళ్లకో లేదా పదేళ్లకో మారిపోతూ ఉంటుంది. మనం బిజినెస్‌ స్కూల్‌లో నేర్చుకున్న దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. మేము అలాంటి పరిస్థితులకు సవాలు విసిరాం. రిలయన్స్‌  1960లలో ఒకలాగా, 70ల్లో ఆ తర్వాత 2000.. 2020లలో మరోలాగా మారింది. ఇప్పుడు పూర్తి భిన్నం.  

→ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ విషయానికొస్తే..  ఒకవేళ పరిస్థితులు ఘోరంగా దిగజారితే బైటపడగలమా అనేది ఆలోచించాలి. ఏం చేసినా సరే మా ఉద్యోగుల కళ్లలోకి చూసి నిజాయితీ గా మాట్లాడగలిగేలా ఉండాలని 30..40 ఏళ్ల క్రి తం నేను వ్యక్తిగతంగా ఒక సిద్ధాంతం పెట్టుకున్నాను. ఈ సంస్థాగత సంస్కృతే ఎంతæ పెద్ద రిస్క్ ల నుంచైనా కాపాడగలిగే బీమా.  

→ డీప్‌–టెక్, అధునాతన తయారీ కంపెనీగా ఎదగాలనేది రిలయన్స్‌  లక్ష్యం. మన దగ్గర సరైన టాలెంట్, సరైన లక్ష్యం అంటూ ఉంటే ఎక్కడికి వెళ్లాలి, కోరుకున్నది ఎలా సాధించాలనేది ఏదో విధంగా కనుక్కుంటాం. అది రిలయన్స్‌ డీఎన్‌ఏలోనే ఉంది.   
 
నాన్నకు మాటిచ్చాను.. 
ఇంటర్వ్యూ సందర్భంగా ముకేశ్‌ అంబానీ తన తండ్రి ధీరుభాయ్‌ అంబానీని గుర్తు చేసుకున్నారు. ‘రిలయన్స్‌ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఈ సంస్థ చిరకాలం ఉండాలి. నా తర్వాత, నీ తర్వాత కూడా రిలయన్స్‌ కొనసాగేలా నువ్వు చూడాలి అని నాన్న చెప్పారు. మా తదనంతరం కూడా రిలయన్స్‌ ఉంటుందని నేను ఆయనకు మాట ఇచ్చాను. 2027లో రిలయన్స్‌ గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు జరుపుకుంటుంది. కానీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత కూడా రిలయన్స్‌ భారతదేశానికి, మానవాళికి సేవ చేయడాన్ని కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. అది కచ్చితంగా జరుగుతుందని గాఢంగా నమ్ముతున్నాను‘ అని ముకేశ్‌ అంబానీ చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement