లండన్: నాలుగేళ్ల తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన అమెరికా దిగ్గజ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ గ్రాండ్స్లామ్ సింగిల్స్లో రీఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఈనెల 29 నుంచి జరిగే ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో 44 ఏళ్ల సెరెనా సింగిల్స్ విభాగంలోనూ బరిలోకి దిగనుంది. ఈ మేరకు వింబుల్డన్ టోర్నీ నిర్వాహకులు చివరిదైన ఎనిమిదో వైల్డ్ కార్డును సెరెనాకు కేటాయిస్తూ సోమవారం నిర్ణయం తీసుకున్నారు.
తన సోదరి వీనస్ విలియమ్స్తో కలిసి సెరెనా వింబుల్డన్ మహిళల డబుల్స్ విభాగంలోనూ ఆడేందుకు ఇంతకుముందే వైల్డ్ కార్డు ఇచ్చారు. తాజా ప్రకటనతో సెరెనా సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీపడనుంది. చివరిసారి 2022లో వింబుల్డన్ టోర్నీలో ఆడిన సెరెనా తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. అదే ఏడాది ఆటకు గుడ్బై చెప్పిన సెరెనా ఇటీవల పునరాగమనం చేసింది. సెరెనా తన కెరీర్లో 23 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గింది. ఆమె అత్యధికంగా ఏడుసార్లు చొప్పన వింబుల్డన్, ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్స్ సొంతం చేసుకోగా... ఆరుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్స్ను, మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ను సాధించింది.


