breaking news
Ril chairman
-
జియో లిస్టింగ్ వచ్చే ఏడాదే..!
వచ్చే ఏడాది(2026) ద్వితీయార్ధంలోగా జియో ప్లాట్ఫామ్స్ను స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేయనున్నట్లు ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ కంపెనీ 48వ ఏజీఎంలో ప్రకటించారు. ఏఐ సంబంధిత భారీ మౌలికసదుపాయాలతో రిలయన్స్ ఇంటెలిజెన్స్ పేరున కొత్త జేవీకి తెరతీయనున్నట్లు పేర్కొన్నారు. గ్లోబల్ టెక్ దిగ్గజాలు మెటా, గూగుల్తో భాగస్వామ్యానికి చేతులు కలిపినట్లు వెల్లడించారు. తద్వారా ప్రతి ఒక్కరికీ ఏఐ, ప్రతి చోటా ఏఐ విజన్ను ప్రకటించారు. రిలయన్స్తో కలసి జామ్నగర్ క్లౌడ్ రీజన్ను ఏర్పాటు చేయనున్నట్లు ఏజీఎంలో వర్చువల్గా పాలుపంచుకున్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. మెటా వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకెర్బర్గ్ సైతం రిలయన్స్తో భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. సంస్థ ఓపెన్ సోర్స్ లామా మోడళ్లను జేవీ వినియోగించుకోనున్నట్లు తెలియజేశారు. దేశీ సంస్థలకు ఈ జేవీ గేమ్ చేంజర్గా నిలవనున్నట్లు ముకేశ్ పేర్కొన్నారు. రూ. 855 కోట్ల ప్రాథమిక పెట్టుబడితో మెటాతో జేవీకి తెరతీయనున్నారు. జేవీలో ఆర్ఐఎల్కు 70 శాతం, మెటాకు 30 శాతం వాటా లభించనుంది.జియో ప్లాట్ఫామ్స్ ఆర్ఐఎల్కు టెలికం, డిజిటల్ అనుబంధ సంస్థగా వ్యవహరిస్తున్న జియో ప్లాట్ఫామ్స్లో ఎంతమేర వాటా విక్రయించేదీ ముకేశ్ వెల్లడించలేదు. ప్రస్తుతం సంస్థలో ఆర్ఐఎల్కు 66.3 శాతం వాటా ఉంది. మెటా(ఫేస్బుక్) వాటా 10 శాతంకాగా.. గూగుల్ 7.7 శాతం వాటా కలిగి ఉంది. మిగిలిన 16 శాతం వాటా పీఈ దిగ్గజాల చేతిలో ఉంది. ఐపీవోలో 10 శాతం వాటా ఆఫర్ చేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కంపెనీ విలువను 136–154 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఈ స్థాయిలో విలువ నమోదైతే ప్రపంచంలోనే ఆరో పెద్ద కంపెనీగా నిలిచే వీలుంది. ఆవిర్భవించిన దశాబ్ద కాలంలో దేశంలోనే అతిపెద్ద టెలికం కంపెనీగా అవతరించిన జియో వినియోగదారుల సంఖ్య 50 కోట్లను దాటినట్లు సంస్థ చీఫ్ ఆకాశ్ అంబానీ వెల్లడించారు. → జియోఫ్రేమ్స్ పేరుతో జియో స్మార్ట్గ్లాస్లోకి ప్రవేశించింది. చేతులు వినియోగించకుండా కాల్స్, మ్యూజిక్, వీడియో రికార్డింగ్, ఏఐ వాయిస్ అసిస్టెంట్ తదితరాలను వివిధ భాషలతో నిర్వహించవచ్చు.→ వాల్ట్ డిస్నీ ఇండియా విలీనంతో ఏర్పాటైన జియోహాట్స్టార్ రెండో పెద్ద స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్గా నిలిచింది. 34% టీవీ మార్కెట్ వాటా దీని సొంతం.రిలయన్స్ రిటైల్.. 40,000 కోట్లు ఆసియాలోకెల్లా అతిపెద్ద ఏకీకృత ఫుడ్ పార్క్ల ఏర్పాటుకు రిలయన్స్ రిటైల్ రూ. 40,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. వీటిలో ఏఐ ఆధారిత ఆటోమేషన్, రోబోటిక్స్, సస్టెయినబుల్ టెక్నాలజీలు వినియోగించనున్నట్లు సంస్థ ఈడీ ఈషా అంబానీ పేర్కొన్నారు. మూడేళ్లలో వార్షికంగా ఆదాయంలో 20 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఎఫ్ఎంసీజీ బిజినెస్(ఆర్సీపీఎల్)ను 8 రెట్లు పెంచే ప్రణాళికల్లో ఉంది. తద్వారా ఆదా యాన్ని రూ. లక్ష కోట్లకు చేర్చాలని ఆశిస్తోంది.ఓ2సీ... భారీ విస్తరణఆయిల్ 2 కెమికల్స్ విభాగంలో కొత్త ప్రాజెక్టులపై రూ. 75,000 కోట్ల పెట్టుబడులు వెచి్చంచనున్నట్లు ఆర్ఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ వెల్లడించారు. ఏజీఎంలో తొలిసారి ప్రసంగించారు. 2035కల్లా నికర కర్బన రహిత లక్ష్యాన్ని సాధించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. మొబిలిటీ విభాగంలో జియో–బీపీ ఇంధన రిటైల్ నెట్వర్క్ను విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈవీ చార్జింగ్, బ్యాటరీల స్వాపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వేగంగా పెంచుతున్నట్లు అనంత్ తెలియజేశారు. n న్యూ ఎనర్జీ విభాగం రానున్న 5–7 ఏళ్లలో ఓ2సీ బిజినెస్ను అధిగమించనున్నట్లు ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. 2028 కల్లా రెట్టింపు ఇబిటాను సాధించే లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. 2026 కల్లా బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రణాళికలు వేసింది. 2032 కల్లా 3 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ సామర్థ్యంపై కంపెనీ కన్నేసింది. -
నా జీవితంలో అతిపెద్ద రిస్క్.. జియో: ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ: జియో రూపంలో టెలికం రంగంలోకి రీఎంట్రీ చేయడమనేది తన జీవితంలో తీసుకున్న అతి పెద్ద రిస్క్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అభివర్ణించారు. అత్యంత అధునాతనమైన డిజిటల్ టెక్నాలజీకి భారత్లో పరిస్థితులు ఇంకా అనువుగా లేవని, ఈ వెంచర్ ఆర్థికంగా విఫలమవుతుందని విశ్లేషకులు హెచ్చరించినప్పటికీ వెనక్కి తగ్గలేదని ఆయన చెప్పారు. ఒకవేళ విశ్లేషకులు చెప్పినది నిజంగానే జరిగినా కూడా, దేశాన్ని డిజిటల్ బాట పట్టించడంలో జియో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో, ఆ మాత్రం రిస్కు తీసుకోవడంలో తప్పు లేదనిపించిందని మెకిన్సే అండ్ కంపెనీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ‘మేము ఎప్పుడూ పెద్ద రిస్క్ లే తీసుకున్నాం. మాకు భారీ స్థాయి ముఖ్యం. మేము ఇప్పటి వరకు తీసుకున్న అతి పెద్ద రిస్కు జియోనే. అప్పట్లో మా సొంత డబ్బును ఇన్వెస్ట్ చేశాం. నేను మెజారిటీ వాటాదారుగా ఉన్నాను. 4జీ మొబైల్ నెట్వర్క్ విస్తరణ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ కోట్ల కొద్దీ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తున్న క్రమంలో ఈ టెక్నాలజీకి భారత్లో అనువైన పరిస్థితులు లేవని, డబ్బంతా వృథా అవుతుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ మా కంపెనీ బోర్డుకు నేను ఒక్కటే చెప్పాను. ఇదంతా మన సొంత డబ్బు. మహా అయితే దీనిపై మనకు పెద్దగా ఆదాయం రాకపోవచ్చు. ఫర్వాలేదు. దీనితో దేశాన్ని డిజిటలైజ్ చేయొచ్చు. భారత్ను సంపూర్ణంగా మార్చివేయొచ్చు. ఆ విధంగా దేశం కోసం రిలయన్స్ ఒక గొప్ప మేలు చేసినట్లవుతుంది. అత్యుత్తమ విరాళం ఇచ్చినట్లవుతుంది అన్నాను‘ అని అంబానీ పేర్కొన్నారు. 2016లో ప్రారంభమైన జియో.. నేడు 47 కోట్ల మంది యూజర్లతో, 5జీ, క్లౌడ్, ఏఐ సర్వీసుల్లోనూ కార్యకలాపాలతో టెలికంలో అగ్రస్థానంలో ఉంది. ఇంకా ఏమన్నారంటే.. → ప్రపంచం ప్రతి అయిదేళ్లకో లేదా పదేళ్లకో మారిపోతూ ఉంటుంది. మనం బిజినెస్ స్కూల్లో నేర్చుకున్న దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. మేము అలాంటి పరిస్థితులకు సవాలు విసిరాం. రిలయన్స్ 1960లలో ఒకలాగా, 70ల్లో ఆ తర్వాత 2000.. 2020లలో మరోలాగా మారింది. ఇప్పుడు పూర్తి భిన్నం. → రిస్క్ మేనేజ్మెంట్ విషయానికొస్తే.. ఒకవేళ పరిస్థితులు ఘోరంగా దిగజారితే బైటపడగలమా అనేది ఆలోచించాలి. ఏం చేసినా సరే మా ఉద్యోగుల కళ్లలోకి చూసి నిజాయితీ గా మాట్లాడగలిగేలా ఉండాలని 30..40 ఏళ్ల క్రి తం నేను వ్యక్తిగతంగా ఒక సిద్ధాంతం పెట్టుకున్నాను. ఈ సంస్థాగత సంస్కృతే ఎంతæ పెద్ద రిస్క్ ల నుంచైనా కాపాడగలిగే బీమా. → డీప్–టెక్, అధునాతన తయారీ కంపెనీగా ఎదగాలనేది రిలయన్స్ లక్ష్యం. మన దగ్గర సరైన టాలెంట్, సరైన లక్ష్యం అంటూ ఉంటే ఎక్కడికి వెళ్లాలి, కోరుకున్నది ఎలా సాధించాలనేది ఏదో విధంగా కనుక్కుంటాం. అది రిలయన్స్ డీఎన్ఏలోనే ఉంది. నాన్నకు మాటిచ్చాను.. ఇంటర్వ్యూ సందర్భంగా ముకేశ్ అంబానీ తన తండ్రి ధీరుభాయ్ అంబానీని గుర్తు చేసుకున్నారు. ‘రిలయన్స్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఈ సంస్థ చిరకాలం ఉండాలి. నా తర్వాత, నీ తర్వాత కూడా రిలయన్స్ కొనసాగేలా నువ్వు చూడాలి అని నాన్న చెప్పారు. మా తదనంతరం కూడా రిలయన్స్ ఉంటుందని నేను ఆయనకు మాట ఇచ్చాను. 2027లో రిలయన్స్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటుంది. కానీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత కూడా రిలయన్స్ భారతదేశానికి, మానవాళికి సేవ చేయడాన్ని కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. అది కచ్చితంగా జరుగుతుందని గాఢంగా నమ్ముతున్నాను‘ అని ముకేశ్ అంబానీ చెప్పారు. -
రిలయన్స్ రిటైల్లో సిల్వర్ లేక్కు వాటా!
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్కు అనుబంధ విభాగమైన రిలయన్స్ రిటైల్లో పీఈ సంస్థ సిల్వర్ లేక్ వాటా కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ గ్రూప్లోని ప్రధాన కంపెనీ ఆర్ఐఎల్తో చర్చలు నిర్వహిస్తున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ఈ కథనం ప్రకారం ఇప్పటికే చర్చలు ప్రారంభమైనట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. రిలయన్స్ రిటైల్లో 1.7-1.8 శాతం వాటా కొనుగోలుకి పీఈ సంస్థ సిల్వర్ లేక్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వాటా విలువను రూ. 7,500 కోట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారీ విలువ సిల్వర్ లేక్తో 1.8 శాతం వాటాకుగాను రూ. 7,500 కోట్లకు డీల్ కుదిరితే.. రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.3 లక్షల కోట్ల(57 బిలియన్ డాలర్లు)కు చేరవచ్చని నిపుణులు ఊహిస్తున్నారు. డిజిటల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియో బాటలో రిలయన్స్ రిటైల్లోనూ మైనారిటీ వాటా విక్రయం ద్వారా మరిన్ని నిధులు సమకూర్చుకునే ప్రణాళికల్లో ముకేశ్ అంబానీ ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కాగా.. కంపెనీ విధానాల ప్రకారం ఊహాజనిత వార్తలపై స్పందించబోమంటూ ఆర్ఐఎల్ ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే వృద్ధికి వీలుగా కంపెనీ వివిధ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు. డీల్ తదితర అంశాలకు తెరతీస్తే సెబీ నిబంధనల ప్రకారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేస్తామని స్పష్టం చేశారు. కాగా.. రిలయన్స్ జియోలో ఇప్పటికే సిల్వర్ లేక్ రూ. 10,202 కోట్లను ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలకు రిలయన్స్ రిటైల్లోనూ వాటా కొనుగోలుకి వీలు కల్పిస్తున్నట్లు వార్తా కథనంలో మీడియా పేర్కొంది. కన్సాలిడేషన్ గత నెలలో కిశోర్ బియానీ సంస్థ ఫ్యూచర్ గ్రూప్నకు చెందిన రిటైల్, హోల్సేల్ బిజినెస్లను ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ రిటైల్ సొంతం చేసుకున్న విషయం విదితమే. ఇందుకు రూ. 24,713 కోట్ల డీల్ను కుదుర్చుకుంది. తద్వారా దేశీ రిటైల్ రంగంలో కన్సాలిడేషన్ ద్వారా రిలయన్స్ గ్రూప్.. రిటైల్ బిజినెస్ను మరింత పటిష్ట పరచుకోనున్నట్లు నిపుణులు తెలియజేశారు. రిలయన్స్ రిటైల్లో 10 శాతంవరకూ వాటాను విక్రయించే ప్రణాళికల్లో ముకేశ్ అంబానీ ఉన్నట్లు చెబుతున్నారు. -
రిలయన్స్ జియోలో గూగుల్కు వాటా
-
రిలయన్స్ జియోలో గూగుల్కు వాటా
ఇటీవల పలు విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకట్టుకుంటున్న జియో ప్లాట్ఫామ్స్ తాజాగా టెక్నాలజీ దిగ్గజం గూగుల్ను సైతం ఆకర్షించింది. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్కు డిజిటల్, టెలికం విభాగమైన జియో ప్లాట్ఫామ్స్లో గూగుల్ రూ. 33,737 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తాజాగా ముకేశ్ అంబానీ వెల్లడించారు. తద్వారా రిలయన్స్ జియోలో 7.7 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేశారు. గూగుల్తో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా అందుబాటు ధరల్లో 4జీ/5జీ ఫోన్లను తయారు చేనున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా దేశీ వినియోగం కోసం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ను రూపొందించనున్నట్లు వివరించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ వీడియో కాన్ఫెరెన్సింగ్ ద్వారా నిర్వహిస్తున్న ఏజీఎంలో ఈ వివరాలు తెలియజేశారు. రానున్న 5-7 ఏళ్ల కాలంలో దేశీయంగా 10 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసే ప్రణాళిల్లో ఉన్నట్లు సోమవారం గూగుల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తద్వారా డిజిటల్ టెక్నాలజీస్లో మరింత విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం యథాతథంగా రూ. 1918 వద్ద ట్రేడవుతోంది. తొలుత 2.2 శాతం ఎగసి రూ. 1989 సమీపానికి చేరింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం విశేషం! క్వాల్కామ్తో.. పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ కంపెనీ ఆర్ఐఎల్కు అనుబంధ విభాగమైన జియో ప్లాట్ఫామ్స్లో చివరిగా చిప్ దిగ్గజం క్వాల్కామ్ రూ. 730 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. తద్వారా జియోలో 0.15 శాతం వాటాను సొంతం చేసుకుంది. జియో ప్లాట్ఫామ్స్లో 25.24 శాతం వాటాను విక్రయించడం ద్వారా ఇప్పటికే ఆర్ఐఎల్ రూ. 1.18 లక్షల కోట్లకుపైగా సమీకరించింది. జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్సహా చిప్ దిగ్గజాలు ఇంటెల్, క్వాల్కామ్.. పీఈ సంస్థలు కేకేఆర్, సిల్వర్ లేక్ తదితరాలు ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. ఈ పెట్టుబడులకు జతగా రైట్స్ ఇష్యూ ద్వారా ఆర్ఐఎల్ రూ. 53,124 కోట్లను సమకూర్చుకుంది. ఈ బాటలో గతేడాది ఇంధన రిటైల్ నెట్వర్క్లో 49 శాతం వాటా అమ్మకం ద్వారా బీపీ నుంచి రూ. 7,000 కోట్లు సమీకరించింది. వెరసి నికరంగా రుణరహిత కంపెనీగా ఆవిర్భవించినట్లు గత నెలలో ఆర్ఐఎల్ తెలియజేసింది. మార్చికల్లా ఆర్ఐఎల్ రుణ భారం రూ. 1.6 లక్షల కోట్లుగా నమోదైన సంగతి తెలిసిందే. -
ఆర్ఐఎల్ ఏజీఎం- ముకేశ్ గ్రూప్ షేర్ల హవా
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వర్చువల్ ప్రాతిపదికన నేడు వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) నిర్వహిస్తోంది. ఇటీవల డిజిటల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియోకు తరలివచ్చిన విదేశీ పెట్టుబడులు, ఆర్ఐఎల్ చేపట్టిన రైట్స్ ఇష్యూ నేపథ్యంలో ఏజీఎంకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. గత ఏజీఎంలో రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ పేర్కొన్న గడువుకంటే ముందుగానే ఆర్ఐఎల్ రుణరహిత దిగ్గజంగా ఆవిర్భవించిన నేపథ్యంలో ప్రస్తుత సమావేశంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ముకేశ్ అంబానీ వెల్లడించనున్న ప్రణాళికలపై అంచనాలతో ఇన్వెస్టర్లు ఆర్ఐఎల్ గ్రూప్ కౌంటర్లలో కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. దీంతో ముకేశ్ అంబానీ గ్రూప్ షేర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. జోరుగా హుషారుగా ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఆర్ఐఎల్ షేరు 2.2 శాతం ఎగసి రూ. 1960 వద్ద ట్రేడవుతోంది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ఇటీవలే కంపెనీ మార్కెట్ విలువ రూ. 12 లక్షల కోట్లను అధిగమించింది. తద్వారా ఈ ఘనతను సాధించిన తొలి దేశీ కంపెనీగా రికార్డ్ నెలకొల్పింది. ఈ ప్రభావంతో గ్రూప్లోని ఇతర కంపెనీల కౌంటర్లు సైతం జోరందుకున్నాయి. హాథవే కేబుల్ అండ్ డేటాకామ్ 13 శాతం దూసుకెళ్లి రూ. 47 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 50 సమీపంలో ఏడాది గరిష్టాన్ని తాకింది. ఇతర కౌంటర్లలో డెన్ నెట్వర్క్స్, 5.25 శాతం జంప్చేసి రూ. 94 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 97 సమీపంవరకూ ఎగసింది. ఇక రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 0.5 శాతం బలపడి రూ. 461 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 468ను దాటింది. ఇటీవల ర్యాలీ రెండు రోజులుగా దూకుడు చూపుతున్న హాథవే కేబుల్ షేరు గత నెల రోజుల్లో 73 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! ఇదే విధంగా రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైతం 46 శాతం లాభపడింది. ఈ బాటలో టీవీ18 బ్రాడ్క్యాస్ట్, నెట్వర్క్ 18 మీడియా, డెన్ నెట్వర్క్స్ 12-40 శాతం మధ్య ఎగశాయి. -
ఇక సౌదీ అరామ్కో డీల్పై దృష్టి
దేశ కార్పొరేట్ చరిత్రలో కొత్త రికార్డును లిఖిస్తూ అతితక్కువ సమయంలోనే రూ. 1.15 లక్షల కోట్లను సమీకరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ తాజాగా సౌదీ అరామ్కో డీల్పై దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. విదేశీ చమురు దిగ్గజం సౌదీఅరామ్కోతో చర్చలు చేపట్టడం ద్వారా భాగస్వామ్యానికి తెరతీసే ప్రణాళికలను గతేడాదిలోనే ఆర్ఐఎల్ ప్రకటించింది. ఆర్ఐఎల్కు చెందిన చమురు, కెమికల్స్ విభాగంలో మైనారిటీ వాటా విక్రయం ద్వారా 15 బిలియన్ డాలర్లను సమకూర్చుకునేందుకు ముకేశ్ గతంలోనే ప్రణాళికలు వేశారు. నిజానికి ఈ ఏడాది(2020) మార్చికల్లా డీల్ కుదుర్చుకోవాలని ఆర్ఐఎల్ తొలుత భావించింది. కోవిడ్-19 కారణంగా ఒక దశలో చమురు ధరలు కుప్పకూలడంతో డీల్ ఆలస్యమైనట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. అయితే డీల్ను పూర్తిచేసే అంశంపై ప్రస్తుతానికి ఎలాంటి గడువునూ కంపెనీ వెల్లడించలేదు. సౌదీ అరామ్కోతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకునే సన్నాహాల్లో ఉన్నట్లు గతేడాది నిర్వహించిన వార్షిక సమావేశంలో ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ వాటాదారులకు తెలియజేశారు. గుజరాత్లోని జామ్నగర్లోగల రెండు రిఫైనరీలతోపాటు.. పెట్రోకెమికల్ ఆస్తులను కలిపి ఓ2సీగా విడదీయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇంధన రిటైలింగ్ బిజినెస్లో 51 శాతం వాటా సైతం ఓ2సీలో భాగంకానున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అరామ్కోకు ఆయిల్ టు కెమికల్(ఓ2సీ) బిజినెస్లో 20 శాతం వాటాను విక్రయించేందుకు ఆర్ఐఎల్ సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే. జియోతో ఊపు ఇటీవల డిజిటల్, టెలికం విభాగం రిలయన్స్ జియోలో 25 శాతం వాటా విక్రయం ద్వారా మాతృ సంస్థ ఆర్ఐఎల్ రూ. 1.15 లక్షల కోట్లను సమీకరించిన విషయం విదితమే. మరోవైపు రూ. 53,000 కోట్ల విలువగల రైట్స్ ఇష్యూ చేపట్టడం ద్వారా సైతం నిధులను సమకూర్చుకుంది. తద్వారా ఆర్ఐఎల్ రుణరహిత కంపెనీగా ఆవిర్భవించింది కూడా. ఈ బాటలో తాజాగా సౌదీ అరామ్కోతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా ఓ2సీ బిజినెస్కు సైతం జోష్నిచ్చే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఓ2సీ బిజినెస్ ఎంటర్ప్రైజ్ విలువను విశ్లేషకులు 75-65 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. దీంతో 20 శాతం వాటాకుగాను 15-13 బిలియన్ డాలర్లమేర ఆర్ఐఎల్ సమకూర్చుకునే వీలున్నట్లు ఊహిస్తున్నారు. కాగా.. కంపెనీ ఈ ఏడాది సాధారణ వార్షిక సమావేశాన్ని(ఏజీఎం) వర్చువల్ పద్ధతిలో జులై 15న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
అంచనాలకు అనుగుణంగా ఆర్ఐఎల్ ఫలితాలు
సాక్షి, ముంబై : ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. ఈ క్వార్టర్లో కంపెనీ నికర లాభం 8.8 శాతం వృద్ధితో రూ 10,251 కోట్లుగా నమోదైంది. సంస్ధ రాబడి 55.9 శాతం పెరిగి రూ 1,71,336 కోట్లకు చేరింది. పన్నులకు ముందు లాభం 9.3 శాతం పెరిగి రూ 14,445 కోట్లుగా నమోదైంది. మూడో త్రైమాసికంలో కంపెనీ అన్ని విభాగాల్లోనూ సంతృప్తికర ఫలితాలను సాధించిందని ఆర్ఐఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. రూ 10,000 కోట్లు దాటిన జియో రాబడి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రిలయన్స్ జియో కీలక విభాగాల్లో మెరుగైన సామర్ధ్యం కనబరిచింది. నిర్వహణ రాబడి రూ 10,383 కోట్లు కాగా నికర లాభం 65 శాతం వృద్ధితో రూ 831 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో జియో రూ 504 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంచనాలకు మించి జియో ప్రస్ధానం అత్యద్భుతంగా సాగుతోందని, 28 కోట్ల మంది సబ్స్ర్కైబర్లతో జియో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ డేటా నెట్వర్క్గా ఆవిర్భవించిందని ఆర్ఐఎల్ సీఎండీ ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. అందుబాటు ధరల్లో అత్యుత్తమ నాణ్యతతో ప్రతిఒక్కరికీ చేరువ కావాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా జియో పయనం సాగుతోందన్నారు. -
జియోతో రిలయన్స్లో జోష్
సాక్షి,ముంబయి: రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ సెప్టెంబర్ 30తో ముగిసిన రెండవ క్వార్టర్లో మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. నికర లాభం 12.5 శాతం వృద్ధితో రూ 8109 కోట్లకు పెరిగింది. కంపెనీ రాబడి 23.9 శాతం పెరిగి రూ 1,01,169 కోట్లకు చేరింది. ఈ క్వార్టర్లో రిలయన్స్ రిటైల్ జెనెసిస్ లగ్జరీ లిమిటెడ్లో 40 శాతం వాటా కొనుగోలు చేసింది. మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఆర్ఐఎల్ బాలాజీ టెలిఫిల్మ్స్లో వాటా కొనుగోలు చేసింది. ఆర్థిక ఫలితాలపై ఆర్ఐఎల్ సీఎండీ ముఖేష్ అంబానీ సంతృప్తి వ్యక్తం చేశారు. కంపెనీ అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించిందన్నారు. ఈ క్వార్టర్లో కంపెనీ అద్భుత సామర్ధ్యం కనబరిచిందని, రిలయన్స్ జియో తన తొలి క్వార్టర్లో మెరుగైన ఫలితాలు రాబట్టిందని అన్నారు. తమ రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపార వృద్ధి కంపెనీ ఫలితాలపై సానుకూల ప్రభావం చూపిందని చెప్పారు. కొత్త ప్రాజెక్టుల ద్వారా వ్యాపార అవకాశాల విస్తృతి ఫలితాలు ఇవ్వడం మొదలైందని అన్నారు. రిటైల్ బిజినెస్ ప్రోత్సాహకర వృద్ధిని నమోదు చేస్తోందని చెప్పారు. డిజిటల్ మార్కెట్లో రిలయన్స్ జియో నూతన తరం డేటా విప్లవాన్ని అందిపుచ్చుకుంటుందని అన్నారు. 4జీ టెక్నాలజీలో భారీగా వెచ్చించడంతో పాటు సరైన వ్యాపార వ్యూహాలతో జియో మెరుగైన ఆర్థిక ఫలితాలను సాధించగలిగిందని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. -
రిలయన్స్ లాభం 6,222 కోట్లు
క్యూ1లో 4 శాతం వృద్ధి.. ♦ ఆదాయం రూ.83,064 కోట్లు;23 శాతం తగ్గుదల ♦ స్టాండెలోన్ లాభం ఏడున్నరేళ్ల గరిష్ట స్థాయి; రూ.6,318 కోట్లు... ♦ ఆరేళ్ల గరిష్టానికి రిఫైనింగ్ మార్జిన్లు; 10.4 డాలర్లుగా నమోదు... న్యూఢిల్లీ : దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) జూన్ క్వార్టర్(2015-16, క్యూ1)లో రూ.6,222 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.5,957 కోట్లతో పోలిస్తే 4.4 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం 23 శాతం తగ్గుదలతో రూ.1,07,905 కోట్ల నుంచి రూ.83,064 కోట్లకు చేరింది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా దిగిరావడం ఆదాయం తగ్గేందుకు దారితీసింది. స్టాండెలోన్ ప్రాతిపదికన... స్టాండెలోన్ ప్రాతిపదికన(అనుబంధం సంస్థలు కాకుండా) రూ.6,318 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది క్యూ1లో రూ.5,649 కోట్లతో పోల్చిచూస్తే.. 12 శాతం వృద్ధి చెందింది. గడిచిన ఏడున్నరేళ్లలో ఈ స్థాయి లాభాలను నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. స్టాండెలోన్ ఆదాయం 28.1 శాతం తగ్గి రూ.71,412 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం- ఒక్కో బ్యారెల్ ముడిచమురును పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చడం ద్వారా రాబడి) జోరందుకోవడం కంపెనీ లాభాల జోరుకు దోహదం చేసింది. క్యూ1లో జీఆర్ఎం 10.4 డాలర్లకు ఎగబాకింది. ఆరేళ్లలో ఇదే అత్యధిక జీఆర్ఎం. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో జీఆర్ఎం 8.7 డాలర్లుకాగా, మార్చి క్వార్టర్లో ఇది 10.1 డాలర్లుగా ఉంది. ఇతర ముఖ్యాంశాలివీ.. {పధానమైన రిఫైనరీ వ్యాపారం నుంచి స్థూల లాభం(పన్ను ముందు) క్యూ1లో 37.7 శాతం ఎగసి రూ.5,252 కోట్లుగా నమోదైంది. ఆదాయం మాత్రం 30 శాతం క్షీణతతో రూ.68,729 కోట్లకు తగ్గింది. క్రూడ్ ధర పతనం దీనికి ప్రధానంగా దారితీసిన అంశం. ►పెట్రోకెమికల్ వ్యాపారం స్థూల లాభం 25.5% ఎగసి రూ.2,338 కోట్లకు చేరింది. ఈ రంగంలో ఆదాయం 18% తగ్గుదలతో రూ.20,858 కోట్లుగా నమోదైంది. ►అమెరికాలో షేల్ గ్యాస్ ఉత్పత్తి ఆదాయం 47.2 శాతం క్షీణించి రూ.854 కోట్లకు పరిమితమైంది. స్థూల నష్టం రూ.49 కోట్లుగా నమోదైంది. ఇక చమురు-గ్యాస్ ఉత్పత్తి వ్యాపారానికి సంబంధించి స్థూల లాభం 97% దిగజారి.. రూ.32 కోట్లకు పరిమితమైంది. గతేడాది క్యూ1లో ఈ మొత్తం రూ.1,042 కోట్లుగా ఉంది. ఈ వ్యాపార విభాగం నుంచి ఆదాయం కూడా 35.3% పడిపోయి రూ.3,178 కోట్ల నుంచి రూ. 2,057 కోట్లకు దిగజారింది. క్రూడ్ ధరల క్షీణత, గ్యాస్ ఉత్పత్తి పతనం వంటివి దీనికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఇక కేజీ-డీ6 ప్రధాన క్షేత్రాల నుంచి క్యూ1లో రిలయన్స్ 0.44 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురు, 37 బిలియన్ ఘనపుటడుడుల(బీసీఎఫ్) గ్యాస్ ను ఉత్పత్తి చేసింది. గతేడాదితో పోలిస్తే వీటి ఉత్పత్తి వరుసగా 16%, 13% చొప్పున పడిపోయింది. రిలయన్స్ రిటైల్ స్థూల లాభం 19% ఎగబాకి రూ.171 కోట్ల నుంచి రూ.203 కోట్లకు పెరిగింది. ఆదాయం 17.5 శాతం వృద్ధితో రూ.3,999 కోట్ల నుంచి రూ.4,698 కోట్లకు ఎగసింది. దేశవ్యాప్తంగా రిలయన్స్ రిటైల్ ప్రస్తుతం 210 నగరాల్లో 2,747 స్టోర్లను నిర్వహిస్తోంది. ఈ ఏడాది జూన్నాటికి రిలయన్స్ మొత్తం రుణ భారం రూ.1,70,814 కోట్లకు పెరిగింది. మార్చి చివరికి ఈ మొత్తం రూ.1,60,860 కోట్లు. ఇక కంపెనీ వద్ద జూన్ చివరికి ఉన్న మొత్తం నగదు నిల్వలు రూ.87,391 కోట్లు. డిసెంబర్లో టెలికం కార్యకలాపాలు ప్రారంభించనున్న రిలయన్స్ జియో సొంత బ్రాండ్పై 4జీ హ్యాండ్సెట్స్ను విక్రయించాలని యోచిస్తోంది. ఇందుకు ప్రముఖ హ్యాం డ్సెట్ తయారీ సంస్థలతో చర్చలు జరుపుతోంది. దీని ధర రూ. 4,000 కన్నా తక్కువగానే ఉండొచ్చని అంచనా. గురువారం బీఎస్ఈలో రిలయన్స్ షేరు ధర 1.97 శాతం క్షీణించి రూ.1,025 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక కంపెనీ ఫలితాలు వెలువడ్డాయి. క్రూడ్ ధరలు భారీగా పడిపోయిన పరిస్థితుల్లో కూడా కంపెనీ మెరుగైన పనితీరుకు ప్రధానంగా హైడ్రోకార్బన్ కార్యకలాపాల అనుసంధానం దోహదం చేసింది. పెట్రో ఉత్పత్తులకు డిమాండ్ పుంజుకోవడంతో పటిష్టమైన రిఫైనింగ్ మార్జిన్లను సాధించగలిగాం. పెట్రోకెమికల్స్ వ్యాపారం కూడా జోరందుకుంది. రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ రంగాల్లో భారీ పెట్టుబడులు, వీటి అనుసంధానంవల్ల ముడి వనరులకు సంబంధించిన వ్యయాలు తగ్గేందుకు వీలవుతోంది. రిలయన్స్ జియో ద్వారా ప్రతిష్టాత్మకమైన 4జీ టెలికం సేవల ప్రారంభం తుది అంకానికి చేరుకుంది. కోట్లాది మంది భారతీయుల జీవనగమనంలో నూతనోత్తేజాన్ని నింపేందుకు మా 4జీ సేవలు దోహదం చేయనున్నాయి. - ముకేశ్ అంబానీ, ఆర్ఐఎల్ చైర్మన్