
ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో నెట్వర్క్ సేవల్లో అంతరాయాలు తలెత్తాయి. ఇంటర్నెట్ కనెక్టివిటీ, మొబైల్ సిగ్నల్, జియో ఫైబర్ సేవలకు సంబంధించిన సమస్యల గురించి వేలాది మంది నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దేశంలోని కేరళ ప్రాంతంలో జియో నెట్వర్క్ ద్వారా కాల్స్, ఇంటర్నెట్ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురైనట్లు అనేక మంది సోషల్ మీడియా వేదికగా నివేదిస్తున్నారు.
ఇప్పటివరకు 12,000కు పైగా రిపోర్టులు నమోదయ్యాయని అంతరాయాల ట్రాకింగ్ ప్లాట్ఫామ్ డౌన్డిటెక్టర్ తెలిపింది. ఇందులో ఎక్కువ ఫిర్యాదులు మొబైల్ డేటా వైఫల్యాలకు సంబంధించినవే. 32 శాతం మంది యూజర్లు కాల్ సంబంధిత సమస్యలను నివేదించగా, 12 శాతం మంది వినియోగదారులు జియో ఫైబర్ సేవల్లో అంతరాయం కలిగినట్లు ఫిర్యాదు చేశారు.
మధ్యాహ్నం 1:45 గంటలకు ఈ సమస్య ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఆ సమయానికి దాదాపు 400 మంది వినియోగదారులు జియో సేవలను యాక్సెస్ చేసేటప్పుడు సమస్యలను నివేదించారు. తర్వాత మధ్యాహ్నం 2:15 గంటలకు కేరళ ప్రాంతం నుంచి గణనీయమైన సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కేరళ ప్రాంతంలో మాత్రమే కొంత సమయం నెట్ వర్క్లో సమస్యలు వచ్చాయని, దేశంలోని మిగిలిన ప్రాంతాలలో ఎటువంటి సమస్యా లేదని జియో వర్గాలు వెల్లడించాయి.