ఇన్ఫోసిస్‌కు షోకాజ్ నోటీసు.. ఎందుకంటే? | Infosys Gets Pre-Show Cause Notice | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్‌కు షోకాజ్ నోటీసు.. ఎందుకంటే?

Aug 1 2024 7:09 AM | Updated on Aug 1 2024 8:52 AM

Infosys Gets Pre-Show Cause Notice

ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ రూ. 32403 కోట్ల జీఎస్‌టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) ఎగవేతపై ప్రీ-షోకాజ్ నోటీసు అందుకుంది. బీఎస్ఈ ఫైలింగ్‌లో సంస్థ ఈ విషయం వెల్లడించింది.

ఇన్ఫోసిస్ లిమిటెడ్.. విదేశీ బ్రాంచ్ ఆఫీస్‌ల కోసం చేసే ఖర్చుల వివరాలను వెల్లడించకలేదని, వాటికి జీఎస్‌టీ చెల్లించలేదని కర్ణాటక జీఎస్‌టీ అధికారులు ప్రీ-షోకాజ్ నోటీసు జారీ చేశారు. 2017 జులై నుంచి 2022 మార్చి వరకు 32403 కోట్ల రూపాయలకు జీఎస్‌టీ చెల్లింపు చేయలేదనేది ఈ ప్రీ-షోకాజ్ నోటీసు సారాంశం.

దీనిపైన ఇన్ఫోసిస్ స్పందిస్తూ.. అటువంటి ఖర్చులపైన జీఎస్‌టీ వర్తించదని తాము విశ్వసిస్తున్నట్లు వెల్లడించింది. అంతే కాకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్, కస్టమ్స్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, భారతీయ సంస్థకు విదేశీ శాఖలు అందించే సేవలు జీఎస్‌టీ పరిధిలోకి రావని సంస్థ పేర్కొంది.

ఇన్ఫోసిస్ ఎప్పటికప్పుడు జీఎస్‌టీ చెల్లిస్తూనే ఉందని, ఈ విషయంలో తాము కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధలనకు లోబడి పాటించాల్సిన అన్ని నిబంధవులను పాటిస్తున్నట్లు తెలిపింది.

ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (ఐజీఎస్‌టీ) చట్టం ప్రకారం భారతదేశం వెలుపల ఉన్న ఇన్ఫోసిస్ కార్యాలయాలు కంపెనీ నుంచి విభిన్న సంస్థలుగా పరిగణించబడతాయని అధికారులు పేర్కొన్నారు. కాబట్టి బ్రాంచ్ కార్యాలయాలు అందించే అన్ని సేవలను దిగుమతిగా పరిగణిస్తామని, తద్వారా జీఎస్‌టీ విధించడం జరుగుతుందని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement