ఆదాయపు పన్ను శాఖ వారు.. మీ సేవలో.. | Income Tax Department New Taxpayer-Friendly Framework 3 Pillars 5 Priorities 7 Principles | Sakshi
Sakshi News home page

ఆదాయపు పన్ను శాఖ వారు.. మీ సేవలో..

Jul 27 2026 9:55 AM | Updated on Jul 27 2026 10:51 AM

Income Tax Department New Taxpayer-Friendly Framework 3 Pillars 5 Priorities 7 Principles

ఔనండి.. నిజమే. ఆదాయపు పన్ను శాఖ వారు ఇందుకు సిద్ధమవుతున్నారు. జూలై 24వ తేదీన 167వ ఇన్‌కం ట్యాక్స్‌ డే నిర్వహించిన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదాయపు పన్ను డిపార్టుమెంటుకి దశ–దిశ నిర్దేశించారు. ఈ సూచనలు అమలైతే చాలా మంచిదే అనుకోవచ్చు. ఈ ఫ్రేమ్‌వర్క్‌లో 5 ప్రాధాన్యతలతో కూడుకున్న మూడు పిల్లర్లతో పాటు ఏడు ప్రధాన సూత్రాలు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..

దేశంలో అప్పీళ్ల సంఖ్య లక్షల్లో పేరుకుపోయింది. వాటిని శీఘ్రగతిని పూర్తి చేయమని నిర్దేశించారు ఆర్థిక మంత్రి. అనిశ్చితి నుంచి కచ్చితమైన పరిస్థితికి వెళ్లాలని నిర్దేసం. కొత్త చట్టంలో మార్పుల వల్ల అప్పీళ్ల సంఖ్యను తగ్గించవచ్చని ఆశాభావం నెలకొంది. ముందుగా మూడు మూల స్తంభాలు చూస్తే..

🔹 సకాలంలో సర్క్యులర్ల ద్వార పన్ను చెల్లింపుదార్ల బాధ్యతలను వారికి తెలియజేయడం. (క్లారిటీ) 
🔹 అధికారుల పరిధిలో చట్టంలో వివిధ అంశాలకు వివరణ ఇచ్చేటప్పుడు స్థిరత్వం, నిలకడ, క్రమబద్ధత. (కన్సిస్టెన్సీ) 
🔹 అప్పేలేట్‌ అధికారులు ఇచ్చే ఆర్డర్లలో విషయం తెలుసుకుని, భవిష్యత్‌ సంస్కరణలకు అవసరమైన సమాచారం గురించి నిరంతరం నేర్చుకోవడం (కంటిన్యూస్‌ లెర్నింగ్‌).

వీటి వల్ల లిటిగేషన్లను నివారించవచ్చు. లిటిగేషన్‌ ఏర్పడ్డ తర్వాత మేనేజ్‌ చేయడం కన్నా ముందుగానే నివారించవచ్చని, దానికి ఈ మూడు అంశాలు ప్రాతిపదికగా ఉండాలనేది ఆలోచన. నిజమే. లిటిగేషనే లేకపోతే, అంతా సాఫీగానే ఉంటుంది కదా.

ఇక పన్ను వ్యవస్థపై ‘విశ్వాసం’ పెంపొందించాలంటే ‘రెస్పాన్సివ్‌ ట్యాక్స్‌ గవర్నెన్స్‌’ ఆవశ్యకతను ప్రతిఫలించేలా ‘5R’లు.. అంటే 5 ప్రాధాన్యతలను గుర్తించారు. అవేంటంటే, పట్టుకోవడం, ప్రతిస్పందించడం, పరిష్కరించడం, పునఃసమీక్షించడం, పన్ను విధానాలను సంస్కరించడం. ఇది చాలా మంచి ఆలోచన. ఇలా చేస్తే, అధికారులను ‘మా మంచి వారు.. మనసున్న వారు’  అని అనకతప్పదు. పట్టుకోవడం అంటే కేసులు పట్టుకోవడం. ట్యాక్స్‌ పేయర్స్‌ ఫిర్యాదులను తెలుసుకోవడం. వాటిని అర్థం చేసుకుని, స్పష్టంగా, పూర్తి సమాచారాన్ని, మర్యాదకరంగా ప్రతి స్థాయిలో ఇస్తూ, ప్రతి స్పందించడం. సకాలంలో సమగ్రంగా పరిష్కారం ఇవ్వడం. ఫిర్యాదులకు కారణాలను తెలుసుకుంటూ, వాటి ద్వారా నేర్చుకుంటూ, జాగ్రత్త వహించడం. అలాగే పన్ను మదింపు విధానం ప్రాసెస్, సిస్టం, పద్ధతులను పునఃసమీక్షించుకుని, ఫిర్యాదుల సంఖ్యను తగ్గించడం.. ఇలా ఈ ఐదు అంశాలూ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.  

నిజాయితీ గల పన్ను చెల్లింపుదార్లకు వెసులుబాట్లు, సౌలభ్యం కల్పించడం.. పన్ను ఎగవేతదార్లను వదలకపోవడం అనే విధానాన్ని పాటించాలనేది హితవు. రెండు వర్గాల వారితోనూ ఒకే విధంగా వ్యవహరించకుండా ఎవరికి తగ్గ ట్రీట్‌మెంట్‌ వారికివ్వాలని అర్థం.  

వికసిత భారత్‌ వైపు అడుగులు వేయాలంటే ఏడు సూత్రాలను పొందుపరిచారు. 
🔹 స్వయంగా, స్వతహాగా పాటించడం 
🔹 సరళీకృత విధి విధానాలు 
🔹 పన్ను విధానంలో అనిశ్చితి లేకుండా అమలుపరచడం, బలోపేతం చేయడం 
🔹 టెక్నాలజీని విస్తృతంగా, బాధ్యతాయుతంగా వాడుకోవడం 
🔹 డిపార్టుమెంటుని సంస్థాగతంగా, పటిష్టంగా చేయడం 
🔹 ప్రజల విశ్వసనీయతని పెంపొందించడం 
🔹 నిరంతర అభివృద్ధి వైపు నిత్యం అడుగులు వేయడం

ఆ మూడు స్తంభాలతో పాటు ఐదు ప్రాధాన్యతలను అమలు చేస్తూ ఏడు సూత్రాలను పాటిస్తే నిజంగానే నిజాయితీపరులకు న్యాయం జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement