ఇండస్‌ఇండ్‌ సీఈఓ రాజీనామా! | IndusInd Bank MD and CEO Sumant Kathpalia resigns with immediate effect | Sakshi
Sakshi News home page

ఇండస్‌ఇండ్‌ సీఈఓ రాజీనామా!

Apr 30 2025 1:21 AM | Updated on Apr 30 2025 8:02 AM

IndusInd Bank MD and CEO Sumant Kathpalia resigns with immediate effect

వైదొలగిన బ్యాంక్‌ సీఈవో సుమంత్‌... 

నైతిక బాధ్యత వహిస్తూ నిర్ణయం 

ఎగ్జిక్యూటివ్‌ల కమిటీ ఏర్పాటు కోసం ఆర్‌బీఐకి వినతి  

ఇప్పటికే తప్పుకున్న డిప్యుటీ సీఈవో అరుణ్‌ ఖురానా

న్యూఢిల్లీ: అకౌంటింగ్‌ అవకతవకల నేపథ్యంలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎండీ, సీఈవో సుమంత్‌ కథ్పాలియా మంగళవారం రాజీనామా చేశారు. అంతకన్నా ముందే సోమవారం నాడు డిప్యుటీ సీఈవో అరుణ్‌ ఖురానా తప్పుకోగా, ఈ ఉదంతం బైటపడటానికి ముందే చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌వో) గోవింద్‌ జైన్‌ వైదొలిగారు. డెరివేటివ్స్‌ పోర్ట్‌ఫోలియోలో దాదాపు రూ. 1,960 కోట్ల మేర అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇవి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కథ్పాలియా రాజీనామా ఏప్రిల్‌ 29న పని గంటలు ముగిసిన తర్వాత నుంచి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు బ్యాంకు తెలిపింది.

తన దృష్టికి వచ్చిన అంశాల విషయంలో తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు గాను నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కథ్పాలియా వివరించారు. శాశ్వత ప్రాతిపదికన కొత్త సీఈవోను నియమించే వరకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ బాధ్యతలను నిర్వర్తించేందుకు ఎగ్జిక్యూటివ్స్‌ కమిటీని ఏర్పాటు చేసేందుకు అనుమతించాల్సిందిగా ఆర్‌బీఐని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ కోరింది.

 డెరివేటివ్స్‌ లావాదేవీల అకౌంటింగ్‌ విధానాల్లో తేడాల వల్ల 2024–25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు నికర విలువపై రూ. 1,979 కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడుతుందంటూ బైటి ఏజెన్సీ నివేదిక ఇచ్చినట్లు బ్యాంకు ఇటీవలే ప్రకటించింది. దీని వల్ల 2024–25లో బ్యాంకు నికర లాభాలు భారీగా క్షీణించవచ్చని లేదా నష్టాలను ప్రకటించవచ్చని అంచనాలు నెలకొన్నాయి. క్యూ4 ఫలితాలను ఎప్పుడు ప్రకటించేది బ్యాంకు ఇంకా వెల్లడించలేదు. 

ఏం జరిగిందంటే.. 
డెరివేటివ్స్‌ పోర్ట్‌ఫోలియోను లెక్కగట్టే అకౌంటింగ్‌ విధానాల్లో లోపాల కారణంగా బ్యాంక్‌ నికర విలువపై సుమారు 2.35 శాతం ప్రతికూల ప్రభావం పడొచ్చని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ గత నెల ప్రకటించడం కలకలం రేపింది. దీనిపై స్వతంత్ర విచారణ జరిపేందుకు మార్చి 20న బ్యాంకు ఓ ప్రొఫెషనల్‌ సంస్థను నియమించింది. అంతర్గతంగా డెరివేటివ్స్‌ ట్రేడ్‌లను నమోదు చేయడంలో లోపాల వల్ల ఊహాజనిత లాభాలు నమోదు కావడమే అకౌంటింగ్‌ అవకతవకలకు దారి తీసిందని, దీనితో మొత్తం గణాంకాలన్నీ మారిపోయాయని సదరు సంస్థ తన నివేదికలో విశ్లేషించింది.

ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా గతేడాది ఏప్రిల్‌ 1 నుంచి ఇంటర్నల్‌ డెరివేటివ్‌ ట్రేడింగ్‌ను బ్యాంక్‌ నిలిపివేసినప్పటికీ, అంతకన్నా ముందు 5–7 ఏళ్లుగా డెరివేటివ్స్‌ పోర్ట్‌ఫోలియో ఖాతాల్లో వ్యత్యాసాలు నమోదవుతూ వస్తున్నాయి. ఇది అంతర్గత, ఆర్‌బీఐ ఆడిట్‌లలో కూడా బైటపడకపోవడం గమనార్హం. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎండీగా సుమంత్‌ను మరో మూడేళ్ల పాటు పొడిగించాలన్న బ్యాంక్‌ ప్రతిపాదనకు ఆర్‌బీఐ నిరాకరించి, ఏడాదికే అనుమతించడం పరిస్థితి తీవ్రతపై సందేహాలు రేకెత్తాయి. 

షేరు క్రాష్‌..!
ఈ క్రమంలోనే  ఇండస్‌ఇండ్‌ బ్యాంకు షేరు ఏడాది గరిష్ట స్థాయి రూ. 1,576 నుంచి ఒక దశలో సుమారు యాభై శాతం పైగా పతనమైంది. ప్రస్తుతం రూ. 837 వద్ద ట్రేడవుతోంది. అయితే, తాజా  వరుస రాజీనామాల పరిణామాలతో బుధవారం బ్యాంకు షేర్లు గణనీయంగా క్షీణించే అవకాశం ఉందని అంచనాలు నెలకొన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement