
ఆరేళ్ల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
మార్చిలో 3.34 శాతానికి పరిమితం
ఆహార ధరలు తగ్గుదల
టోకు ద్రవ్యోల్బణం సైతం కిందికి..
న్యూఢిల్లీ: కూరగాయలు, గుడ్లు తదితర ఉత్పత్తుల ధరలు శాంతించడంతో రిటైల్ ద్రవ్యోల్బణం మరింత కిందకు దిగొచ్చింది. మార్చి నెలకు వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ) 3.34 శాతంగా నమోదైంది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. మధ్య కాలానికి రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి మించకుండా చూడాలన్నది ఆర్బీఐ ముందున్న లక్ష్యం.
అంతకంటే దిగువకే వచ్చినందున ఆర్బీఐ మరో విడత వడ్డీ రేట్ల కోతను చేపడుతుందన్న అంచనాలు బలపడుతున్నాయి. మరోవైపు టోకు ద్రవ్యల్బణం సైతం ఆరు నెలల కనిష్ట స్థాయి 2.05 శాతానికి తగ్గింది. రిటైల్ ద్రవ్యోల్బణం చివరిగా 2019 ఆగస్ట్లో 3.28 శాతంగా నమోదు కావడం గమనార్హం. రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఫిబ్రవరిలో 3.61 శాతం కాగా, 2024 మార్చిలో 4.85 శాతంగా ఉంది. ప్రధానంగా కూరగాయలు, గుడ్లు, పప్పు ధాన్యాలు, మీట్, చేపలు, తృణ ధాన్యాల ధరలు తగ్గడం ద్రవ్యోల్బణం కనిష్టానికి చేరినట్టు ఎన్ఎస్వో తెలిపింది.
⇒ రిటైల్ ఆహార ద్రవ్యోల్బణం మార్చి నెలలో 2.69%కి తగ్గింది. ఫిబ్రవరిలో ఇది 3.75% కాగా, గతేడాది మార్చిలో 8.52%గా ఉంది.
⇒ 2.73%, దినుసులకు సంబంధించి మైనస్ 4.92%గా నమోదు కావడం అనుకూలించింది. 0.50 శాతం రేట్లు తగ్గొచ్చు..
‘ఆహారోత్పత్తుల ధరలు క్షీణించడం వల్లే రిటైల్ ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో దిగొచ్చింది. వచ్చే 3 పాలసీ సమీక్షల్లో 0.50% మేర పాలసీ రేట్లను తగ్గించేందుకు అవకాశాలున్నాయి’అని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు.
టోకు ద్రవ్యోల్బణం 2.05 శాతం
టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) సైతం మార్చి నెలకు 2.05%కి పరిమితమైంది. ఫిబ్రవరిలో ఇది 2.38%గా ఉంటే, 2024 మార్చిలో 0.26%గా ఉండడం గమనార్హం. ప్రధానంగా కూరగాయలు, బంగాళాదుంపలు, ఇతర ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడం ఇందుకు దోహదం చేసింది.