జనవరిలో 2.82 శాతం.. మే నాటికి 4.90 శాతానికి పెరుగుదల
ప్రతి నెలా జాతీయ స్థాయిని మించి ఏపీలో ద్రవ్యోల్బణం నమోదు
ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడి
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు
అధిక ధరల భారంతో ప్రజలకు ఇబ్బందులు
సాక్షి, అమరావతి: ఏపీలో 5 నెలలుగా నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు రాష్ట్రంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగినట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. కేంద్ర గణాంకాల ఆధారంగా ఎస్బీఐ తాజాగా రీసెర్చ్ నివేదికను విడుదల చేసింది. జనవరి నుంచి మే మధ్య దేశంలో 2 శాతం కన్నా అత్యధిక ద్రవ్యోల్బణం గల రాష్ట్రాల్లో ఏపీ(2.08 శాతం) టాప్లో ఉందని పేర్కొంది.
ఆ తర్వాతి స్థానాల్లో అస్సోం, ఒడిశా రాష్ట్రాలున్నాయని తెలిపింది. జనవరి నుంచి మే మధ్య ప్రతి నెలా జాతీయ స్థాయిని మించి రాష్ట్రంలో ద్రవ్యోల్బణం నమోదైనట్లు స్పష్టం చేసింది. రాష్ట్రంలో పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ద్రవ్యోల్బణం ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోవడంతో రాష్ట్రంలో బియ్యం నుంచి నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ప్రజలు అధిక ధరల భారంతో ఇబ్బందులు పడుతున్నారు.


