
దిగుమతి సుంకాల్లో భారీ తగ్గింపు
దేశీయంగా తయారు చేస్తే.. ట్యాక్స్ తక్కువే!
పెట్టుబడిని బట్టి సుంకం 15 శాతమే
ఈవీల స్కీము విధివిధానాల నోటిఫికేషన్
న్యూఢిల్లీ: విదేశీ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు కూడా దేశీయంగా తయారీ కార్యకలాపాలు చేపట్టేలా ప్రోత్సహించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా పెట్టుబడుల పరిమాణం ఆధారంగా దిగుమతి సుంకాలను తగ్గించేలా కొత్త ఈవీ పాలసీ మార్గదర్శకాలను నోటిఫై చేసింది దీని ప్రకారం రూ. 4,150 కోట్ల వరకు స్థానికంగా ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ల తయారీపై ఇన్వెస్ట్ చేస్తే 8,000 వరకు ఈవీలను అత్యంత తక్కువగా 15 శాతం సుంకాలతో దిగుమతి చేసుకునేందుకు వీలవుతుంది.
ప్రస్తుతం ఈ సుంకాలు 70–100 శాతం వరకు ఉన్నాయి. సదరు సంస్థలు అనుమతులు పొందిన నాటి నుంచి మూడేళ్లలోగా భారత్లో తయారీ ప్లాంట్ల కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంటుంది. మరికొద్ది వారాల్లో ఈ స్కీముకు దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియ ప్రారంభమవుతుందని, కనీసం 120 రోజుల పాటు ఇది అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. భారీ పరిశ్రమల శాఖ గతేడాది మార్చి 15న ఈ స్కీమును ప్రకటించింది.
విధివిధానాల్లో కొన్ని..
ప్లాంటు ఏర్పాటు, యంత్ర పరికరాలు మొదలైన వ్యయాలకు స్కీము కింద పెట్టుబడుల ఆధారిత ప్రయోజనాలు లభిస్తాయి. స్థల సమీకరణ కోసం చేసిన వ్యయాలను పరిగణనలోకి తీసుకోరు. అప్లికేషన్ ఫారంతో పాటు దరఖాస్తుదారు రూ. 5,00,000 నాన్–రిఫండబుల్ ఫీజు చెల్లించాలి. ఆటోమోటివ్ తయారీకి సంబంధించి గ్లోబల్ స్థాయిలో గ్రూప్ ఆదాయం రూ. 10,000 కోట్లు దాటిన కంపెనీలకు ఈ స్కీము వర్తిస్తుంది.
గరిష్టంగా రూ. 6,484 కోట్ల వరకు సుంకాలపరమైన మినహాయింపు ఉంటుంది. కార్ల తయారీకి సంబంధించి తొలి మూడేళ్లలో దేశీయంగా జోడించే అదనపు విలువ కనీసం 25 శాతం ఉండాలి. అయిదేళ్లలో దీన్ని 50 శాతానికి పెంచుకోవాలి. చార్జింగ్ మౌలిక సదుపాయాలపై చేసే వ్యయాలను కూడా పెట్టుబడి కింద పరిగణిస్తారు. కంపెనీ హామీ ఇచి్చన పెట్టుబడి మొత్తంలో ఇది 5 శాతం లోపు వరకు దీన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
టెస్లాకు భారత్లో కార్ల తయారీపై ఆసక్తి లేదు..
కేంద్ర మంత్రి కుమారస్వామి వెల్లడి
న్యూఢిల్లీ: అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాకు భారత్లో షోరూమ్లను ప్రారంభించడంపైనే ఆసక్తి ఉంది తప్ప ఉత్పత్తి చేయడంపై లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. ఈవీ పాలసీ మార్గదర్శకాల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. స్కీముకు సంబంధించిన తొలి విడత చర్చల్లో మాత్రమే టెస్లా ప్రతినిధులు పాల్గొన్నారని, రెండో .. మూడో విడత సంప్రదింపుల్లో పాల్గొనలేదని మంత్రి వివరించారు. మరోవైపు, మెర్సిడెస్ బెంజ్, స్కోడా–ఫోక్స్వ్యాగన్, హ్యుందాయ్, కియాలాంటి అంతర్జాతీయ దిగ్గజాలు మాత్రం భారత్లో తయారీపై ఆసక్తి కనపర్చాయని చెప్పారు.