జూలైలో ప్రయాణికుల వాహన విక్రయాలు 34.3% జంప్
టూ, త్రీవీలర్స్ రెండంకెల వృద్ధి
సియామ్ గణాంకాల్లో వెల్లడి
న్యూఢిల్లీ: దేశీయ వాహన పరిశ్రమ జూలైలో ఇప్పటివరకు అత్యుత్తమ విక్రయాలను నమోదు చేసింది. ప్రయాణికుల వాహన(పీవీ) అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 34.3% పెరిగి 4,57,810 యూనిట్లకు చేరాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (సియామ్) గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గతేడాది జూలైలో పీవీ సేల్స్ 3,40,772 యూనిట్లుగా ఉన్నాయి.
అన్ని విభాగాల్లో రెండంకెల వృద్ధి
ద్విచక్ర వాహనాల విక్రయాలు 22.6 శాతం వృద్ధితో 19,23,483 యూనిట్లకు చేరాయి. గతేడాది జూలైలో ఇవి 15,69,120 యూనిట్లుగా నమోదయ్యాయి. త్రిచక్ర వాహన సేల్స్ 33.4 శాతం పెరిగి 92,560 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే నెలలో ఇవి 69,403 యూనిట్లుగా ఉన్నాయి.
‘భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ జూలైలో ఇప్పటివరకు అత్యుత్తమ విక్రయాలను నమోదు చేసింది. పీవీలు, త్రిచక్ర, ద్విచక్ర వాహనాల విభాగాల్లో బలమైన రెండంకెల వృద్ధి నమోదైంది. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఈ సానుకూల ధోరణి పండుగల సీజన్లోకి ప్రవేశిస్తున్న వేళ కూడా కొనసాగుతోంది. ఈసారి వినియోగదారుల సెంటిమెంట్ బలంగా ఉంటుందని ఆశిస్తున్నాము’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు.


