పెట్రోల్ అవసరం లేని వాహనాలు వచ్చేస్తున్నాయి: నితిన్ గడ్కరీ | Indian Auto Companies Will Soon Produce 100 Percent Ethanol | Sakshi
Sakshi News home page

పెట్రోల్ అవసరం లేని వాహనాలు వచ్చేస్తున్నాయి: నితిన్ గడ్కరీ

Aug 6 2024 9:10 PM | Updated on Aug 7 2024 9:47 AM

Indian Auto Companies Will Soon Produce 100 Percent Ethanol

భారతదేశంలో డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్, హైబ్రిడ్, సీఎన్‌జీ కార్లు అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో 100 శాతం ఇథనాల్‌తో నడిచే కార్లు, ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేయడానికి ఇండియన్ కంపెనీలు ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తున్నాయని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం తెలిపారు.

టయోటా కంపెనీ ఉత్పత్తి చేసిన ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజిన్ కలిగిన కారులోనే పార్లమెంటుకు వచ్చిన గడ్కరీ.. మీడియాతో మాట్లాడుతూ.. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్ ఇంజిన్, యూరో 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉండే మొదటి వాహనం అని ఆయన అన్నారు. ఇది జీరో ఉద్గారాలను ఉత్పత్తి చేస్తుందని ఆయన అన్నారు.

టయోటా కంపెనీ ఇటీవల మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఫ్లెక్స్ కార్లను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. టాటా, మారుతి సుజుకి కంపెనీలు కూడా 100 శాతం ఇథనాల్ లేదా ఫ్లెక్స్ ఇంజన్ కార్లను ఉత్పత్తి చేసే దిశగా అడుగులు వేస్తోందని ఆయన అన్నారు.

టూ వీలర్ విభాగంలో.. బజాజ్, టీవీఎస్, హీరో మోటోకార్ప్ వంటి కంపెనీలు.. ఫ్లెక్స్ ఇంజిన్ బైక్‌లు, స్కూటర్‌లను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. పెట్రోల్ పంపుల మాదిరిగానే ఇథనాల్ పంపులు కూడా రానున్నాయి. ఇథనాల్ పరిశ్రమ రైతులకు ఒక వరం అని, ఇథనాల్ డిమాండ్ పెరగడంతోపాటు భారతదేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడం జరుగుతుందని గడ్కరీ అన్నారు.

ఇదీ చదవండి: 'తాత చేసిన పనికి కోటీశ్వరురాలైన మనవరాలు'

ఇది పెట్రోల్ దిగుమతులను భారీగా తగ్గిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత వృద్ధి చేయడానికి ఇదొక చక్కని మార్గమని గడ్కరీ అన్నారు. 2023 ఆగష్టులో నితిన్ గడ్కరీ టయోటా కిర్లోస్కర్ మోటార్స్ అభివృద్ధి చేసిన 100 శాతం ఇథనాల్ బీఎస్ 6 కంప్లైంట్ ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు నమూనాను ఆవిష్కరించారు. అయితే ఇవి ఎప్పుడు మార్కెట్లోకి వస్తాయనే విషయం మీద ఎటువంటి అధికారిక ప్రకటన అందుబాటులో లేదు.

Advertisement
 
Advertisement
Advertisement