జులై 1 నుంచి అమలు
దేశంలోని ఇంధన వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై విధించిన అన్ని రకాల తాత్కాలిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా వెలువడిన ఈ ఆదేశాల ప్రకారం.. జులై 1 (బుధవారం) నుంచి రిటైల్, కమర్షియల్, పారిశ్రామిక వినియోగదారులు ఎలాంటి పరిమితులు లేకుండా ఇంధనాన్ని కొనుగోలు చేయవచ్చు.
దేశీయంగా ఇంధన సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకోవడంతో గతంలో విధించిన ‘మోటార్ స్పిరిట్ అండ్ హై-స్పీడ్ డీజిల్ (రిటైల్ అవుట్లెట్ల ద్వారా సరఫరా తాత్కాలిక నియంత్రణ) ఆర్డర్, 2026’ నిబంధనలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
ప్రధాన మార్పులు ఇవే..
కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో క్షేత్రస్థాయిలో కింది మార్పులు అమలులోకి రానున్నాయి.
రిటైల్ ఫ్యూయల్ స్టేషన్లలో (పెట్రోల్ బంకుల్లో) ఒకే వాహనానికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే విక్రయించాలనే నిబంధన ఇకపై ఉండదు. జులై 1, 2026 నుంచి వాహనదారులు తమ అవసరానికి తగినంత డీజిల్ను స్వేచ్ఛగా కొనుగోలు చేయవచ్చు.
వాణిజ్య, పారిశ్రామిక రంగానికి చెందిన కొనుగోలుదారులు రిటైల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. దీనివల్ల వారు కేవలం తమ సొంత కన్జ్యూమర్ పంపుల నుంచే కాకుండా సాధారణ రిటైల్ బంకుల నుంచి కూడా ఇంధనాన్ని సేకరించుకోవచ్చు.
ఆంక్షలు విధించడానికి కారణం..
పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధ వాతావరణం, అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి మూసివేత వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ సంక్షోభంతో దేశీయంగా ఇంధన కొరత రాకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం జూన్ 12న అత్యవసరంగా ఈ తాత్కాలిక నియంత్రణలను ప్రవేశపెట్టింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సరసమైన ధరలకు ఇంధనాన్ని సమానంగా పంపిణీ చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ధరల వ్యత్యాసంతో పెరిగిన డిమాండ్
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ సాధారణ వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రిటైల్ ధరలను నియంత్రించాయి. ఉదాహరణకు ఢిల్లీలో రిటైల్ బంకుల వద్ద డీజిల్ ధర లీటరుకు రూ.95.20 ఉండగా బల్క్ (భారీ) కొనుగోలుదారులకు లీటరుకు రూ.134.50గా ఉంది.
ఈ భారీ ధరల వ్యత్యాసం (లీటరుకు దాదాపు రూ.39) కారణంగా భారీ పారిశ్రామిక వినియోగదారులు నేరుగా రిటైల్ బంకులను ఆశ్రయించారు. ఫలితంగా జూన్ ప్రారంభంలో చమురు సంస్థలకు డీజిల్పై లీటరుకు రూ.36.5, పెట్రోల్పై రూ.9 చొప్పున ఆదాయ నష్టం వాటిల్లింది. కొన్ని ప్రాంతాల్లో అసాధారణంగా డిమాండ్ పెరిగి కృత్రిమ కొరత ఏర్పడింది.
టెలికాం టవర్లు, ట్రక్కింగ్ కంపెనీలు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) బస్సులు, విద్యుత్ ఉత్పాదక పరిశ్రమలు రిటైల్ బంకుల వైపు మళ్లడంతో.. బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ (నిల్వ ఉంచడం) అరికట్టేందుకు ప్రభుత్వం ఈ పరిమితిని విధించాల్సి వచ్చింది.
ఇప్పుడు ఎందుకు ఎత్తివేశారు?
పెట్రోలియం మంత్రిత్వ శాఖ సమీక్ష ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సంతృప్తికరంగా ఉంది. దేశీయ సరఫరా వ్యవస్థ పూర్తిగా మెరుగుపడటంతో పాటు సాధారణ పంపిణీ ఏర్పాట్లు పునరుద్ధరించారు. అందువల్ల జూన్ 12 నాటి ఆర్డర్ను కొనసాగించాల్సిన అవసరం లేదని భావించిన ప్రభుత్వం ఆంక్షలను ఉపసంహరించుకుంది.
ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్!


