
టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్గా మారిన ఐటీ రంగం
వర్జిన్ అట్లాంటిక్ సీఈవో షాయ్ వైస్
న్యూఢిల్లీ: భారత ఐటీ పరిశ్రమ, ఔట్సోర్సింగ్ మోడల్ నుంచి టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్గా ఎదిగిందని బ్రిటన్ విమానయాన సంస్థ వర్జిన్ అట్లాంటిక్ సీఈవో షాయ్ వైస్ తెలిపారు. ఇండియా మార్కెట్లో విస్తరణకు అపార అవకాశాలు ఉన్నాయన్నారు. తమకు అమెరికా తర్వాత రెండో అతి పెద్ద మార్కెట్గా భారత్ నిలుస్తోందని వైస్ వివరించారు. వర్జిన్ అట్లాంటిక్ గత పాతికేళ్లుగా భారత్కి విమానాలు నడుపుతోంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి లండన్ హీత్రో ఎయిర్పోర్ట్కి రోజూ అయిదు ఫ్లయిట్స్ను నిర్వహిస్తోంది.
ప్రయాణికులను నిరాటంకంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు భారతీయ విమానయాన సంస్థ ఇండిగోతో కంపెనీకి కోడ్õÙర్ ఒప్పందం ఉంది. కొత్త రూట్లలో సర్విసులు ప్రారంభించడమనేది డిమాండ్పై ఆధారపడి ఉంటుందని వైస్ చెప్పారు. భారత్–బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ఇరు దేశల మధ్య వ్యాపార కార్యకలాపాలు పుంజుకుంటాయని, తమ కార్గో వ్యాపారానికి కూడా ఇది ప్రయోజనకరమైన అంశమని తెలిపారు.
భారత్ రూట్లో నడిపే ప్రతి విమానంలో స్థానికతకు పెద్ద పీట వేసేలా నలుగురు లోకల్ సిబ్బంది ఉంటారని, మెనూలో సమోసాలను కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. టారిఫ్లపరమైన ఆందోళనపై స్పందిస్తూ విమానయాన సంస్థలకు ఇలాంటి పరిస్థితులు అలవాటేనని వైస్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, బ్రెగ్జిట్, కోవిడ్ మహమ్మారిలాంటివెన్నో చూశాయని చెప్పారు. ఇక సరఫరావ్యవస్థపరంగా అంతరాయాల విషయానికొస్తే తమ దగ్గర తగినన్ని విమానాలు ఉన్నాయని, ఈ ఏడాది డెలివరీలేమీ లేవని వైస్ వివరించారు.