
న్యూఢిల్లీ: భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) జీడీపీ 6.2 శాతం వృద్ధిని సాధిస్తుందన్న గత అంచనాలను రేటింగ్ సంస్థ ఇక్రా కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా తగినంత వర్షపాతం, చమురు ధరలు బ్యారెల్కు సగటున 70 డాలర్ల స్థాయిలో ఉండొచ్చని భావిస్తున్నట్టు తెలిపింది. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (ఇరాన్–ఇజ్రాయెల్) పెరగడం, ఫైనాన్షియల్ మార్కెట్లలో ఆటుపోట్లు, వాణిజ్య విధానాల్లో అనిశ్చితులు దేశ జీడీపీ వృద్ధి తగ్గేందుకు పొంచి ఉన్న రిస్క్లుగా పేర్కొంది. ఈ మేరకు తాజా నివేదికను విడుదల చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 6.5 శాతం వృద్ధిని సాధిస్తుందని ఆర్బీఐ అంచనా వేయగా.. అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ గ్లోబల్ సైతం ఇదేవిధమైన అంచనాను వ్యక్తం చేయడం గమనార్హం. ‘‘ఏప్రిల్, మే నెలల్లో ఆర్థిక కార్యకలాపాల్లో మిశ్రమ పనితీరు నెలకొంది. వేసవి పంటల ఉత్పాదకత ఆశాజనకంగా ఉంటుందన్న అంచనాలు నెలకొన్నప్పటికీ.. 17 వ్యవసాయేతర సంకేతాలకు గాను తొమ్మిదింటిలోనే మెరుగుదల కనిపించింది’’అని ఇక్రా తెలిపింది.
మే నెలలోనే రుతుపవనాలు రావడంతో విద్యుత్, మైనింగ్ రంగాల పనితీరు ప్రభావితమైనట్టు పేర్కొంది. పట్టణాల్లో బలంగా వినియోగం ఆదాయపన్ను మినహాయింపులు పెంచడం, వడ్డీ రేట్ల తగ్గింపు నేపథ్యంలో పట్టణ వినియోగం బలంగా ఉంటుందని ఇక్రా అంచనా వేసింది. ‘‘సాధారణం కంటే అధిక వర్షపాతం ఉంటుందన్న సానుకూల అంచనాలు ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 2024–25లో 4.6 శాతంగా ఉంటే, 2025–26లో 3.5 శాతానికి పరిమితం అవుతుంది. ఆర్బీఐ ఎంపీసీ అంచనా 3.7 శాతం కంటే ఇంకా తక్కువ’’అని ఇక్రా వివరించింది.
వచ్చే ఆగస్ట్లో జరిగే ఆర్బీఐ ఎంపీసీ సమావేశంలో రేట్ల తగ్గింపునకు అవకాశాల్లేకపోయినప్పటికీ.. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉన్నందున అక్టోబర్ నాటి సమీక్షలో 25 బేసిస్ పాయింట్ల కోతను చేపట్టొచ్చని అభిప్రాయపడింది. చమురు ధరలు బ్యారెల్కు 10 డాలర్లు పెరిగితే దిగుమతులపై 13–14 బిలియన్ డాలర్ల మేర అదనంగా వెచ్చించాల్సి ఉంటుందని, ఇది కరెంట్ ఖాతా లోటును జీడీపీలో 0.3 శాతం మేర పెంచుతుందని ఇక్రా తెలిపింది. ఇక్కడి నుంచి చమురు ధరలు స్థిరంగా పెరుగుతూ పోతే అది భారత కంపెనీల లాభదాయకతను ప్రభావితం చేస్తుందని.. జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించేందుకు దారితీయొచ్చని పేర్కొంది.