
మధ్య స్థాయి కార్పొరేట్లకు కాస్త ఓకే..
ఇండ్–రా నివేదిక
ప్రతీకార టారిఫ్లతో చిన్న, మధ్య తరహా సంస్థలపై (ఎంఎస్ఎంఈ) ఒత్తిడి మరింత పెరిగిపోవచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) ఒక నివేదికలో తెలిపింది. అయితే, మధ్య స్థాయి కార్పొరేట్లకు (ఎంసీ) మాత్రం అనూహ్య ఆర్థిక షాక్ల నుంచి కాస్తంత రక్షణ ఉంటుందని పేర్కొంది. టారిఫ్ల ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉండే సెగ్మెంట్లకు చెందిన ఎంఎస్ఎంఈల నిర్వహణ పరిస్థితులు దిగజారవచ్చని వివరించింది. 2024 మార్చి 31 నాటి గణాంకాల ప్రకారం ఒత్తిడిలో ఉన్న ఎంసీల సంఖ్య 11 శాతమే ఉండగా, ఎంఎస్ఎంఈలు మాత్రం 23 శాతంగా ఉన్నాయి. కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే ఎంసీలు వ్యాపార పరిస్థితులను మెరుగ్గా నిర్వహించుకోగలిగే స్థితిలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 1,898 లిస్టెడ్, అన్లిస్టెడ్ ఎంఎస్ఎంఈలు, 1,055 ఎంసీలపై ఈ అధ్యయనం నిర్వహించారు.
‘సాధారణంగా ఎంసీలతో పోలిస్తే ఎంఎస్ఎంఈలు నిర్వహణ మూలధనం విషయంలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటాయి. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లపై వాటికి తగినంత స్థాయిలో రుణాలు అవసరమవుతాయి. ఎంసీల్లాగా కాకుండా చాలా మటుకు ఎంఎస్ఎంఈలు ప్రమోటర్ల సారథ్యంలో ఉంటాయి. రుణదాతలు / సరఫరాదారులు / కస్టమర్లతో బేరమాడే పరిజ్ఞానం, నైపుణ్యాలు ఉన్నవారు రెండో అంచె మేనేజ్మెంట్లో అంతగా ఉండరు’ అని ఇండ్–రా అసోసియేట్ డైరెక్టర్ నిర్మయ్ షా తెలిపారు.
రూ.250 కోట్ల లోపు సంస్థలపై ప్రభావం..
రూ.250 కోట్ల లోపు ఆదాయం ఉండి, ప్లాంటు..మెషినరీపై రూ.5 కోట్ల లోపు పెట్టుబడులు ఉన్న ఎంఎస్ఎంఈలపై ప్రతీకార టారిఫ్ల ప్రభావం ఒక మోస్తరు నుంచి తీవ్ర స్థాయి వరకు ఉంటుందని ఇండ్–రా తెలిపింది. డిమాండ్ ఏమాత్రం మందగించినా ఎంసీలకన్నా ఎంఎస్ఎంఈలపైనే ఎక్కువగా ప్రభావం ఉండొచ్చని పేర్కొంది. అయితే, వడ్డీ రేట్ల తగ్గుదల, వ్యవస్థలో లిక్విడిటీ మెరుగుపడటం వంటి అంశాలు కాస్త సానుకూలంగా ఉండొచ్చని వివరించింది.
ఇదీ చదవండి: మూడు రోజుల్లో స్కైప్ కనుమరుగు
ఎస్ఎంఈల పెట్టుబడి వ్యయాలు కోవిడ్ తర్వాత కాస్త పుంజుకున్నప్పటికీ చారితక్ర స్థాయులతో పోలిస్తే ఇంకా తక్కువగానే ఉన్నాయని నివేదిక వివరించింది. సుంకాలపరంగా అసమానతలున్న దేశాలపై ఏప్రిల్ 2న అమెరికా ప్రతీకార టారిఫ్లు ప్రకటించడం, ఆ తర్వాత వాటిని 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేయడం తెలిసిందే.