
నియంత్రణ నిబంధనలు కఠినతరం కావడంతో వరుసగా మూడు నెలల పాటు క్షీణించిన ఇండెక్స్ డెరివేటివ్స్, ఆప్షన్స్ మార్కెట్ క్రమంగా స్థిరపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నట్లు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. మార్కెట్ వర్గాలు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయనడానికి వాల్యూమ్స్ నిదర్శనంగా నిలుస్తున్నాయని పేర్కొంది. గతేడాది నవంబర్ నుంచి కఠినతర నిబంధనల అమలు కారణంగా ఇండెక్స్ ఆప్షన్లలో ట్రేడింగ్ లావాదేవీలు గణనీయంగా పడిపోయాయి.
ఇదీ చదవండి: జెప్టో కేఫ్ల మూసివేత..?
2024 ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంతో పోలిస్తే 2024 డిసెంబర్ నుంచి 2025 మార్చి మధ్య సగటున రోజువారీ ప్రీమియం టర్నోవరు 18 శాతం క్షీణించింది. ఆప్షన్స్ కాంట్రాక్టుల సంఖ్య 60 శాతం పడిపోయింది. రూ. 10,000 లోపు నెలవారీ ప్రీమియం టర్నోవరు ఉండే ఇన్వెస్టర్ల సంఖ్య వార్షిక ప్రాతిపదికన 2025 మార్చిలో 49 శాతం తగ్గింది. 2024–25 నాలుగో త్రైమాసికంలో తొమ్మిది సెక్యూరిటీస్ బ్రోకింగ్ సంస్థలపై నిర్వహించిన సర్వే ప్రకారం వాటి ఆదాయం 19 శాతం, లాభదాయకత 26 శాతం తగ్గిపోయాయి. అయితే, ఇప్పటికీ ట్రేడింగ్ కార్యకలాపాలు చారిత్రక స్థాయుల కన్నా అధికంగానే ఉన్నట్లు ఇక్రా పేర్కొంది.