
ఈ రంగానికి స్థిరమైన అవుట్లుక్
మధ్యకాలానికి సానుకూల డిమాండ్
గదుల టారిఫ్లు పెరుగుతాయి
రేటింగ్ సంస్థ ఇక్రా నివేదిక
న్యూఢిల్లీ: దేశ ఆతిథ్య రంగం (హాస్పిటాలిటీ) ఈ ఆర్థిక సంవత్సరంలో 6–8 శాతం మధ్య వృద్ధి చెందొచ్చని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది. ఈ రంగానికి అవుట్లుక్ను సానుకూలం నుంచి స్థిరత్వానికి తగ్గించింది. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో వచ్చే కొన్ని నెలల పాటు భారత్కు విదేశీ పర్యాటకుల రాక స్తుబ్దుగా ఉంటుందని, ఆ తర్వాత నుంచి క్రమంగా పుంజుకోవచ్చని తెలిపింది. ఆతిథ్య రంగానికి దేశీ పర్యాటకం ఇప్పటి వరకు కీలక చోదకంగా ఉండగా, సమీప కాలంలోనూ ఇదే ధోరణి కొనసాగుతుందని అంచనా వేసింది.
మౌలిక సదుపాయాలు, విమాన సేవల అనుసంధానత మెరుగుపడడం, జనాభా పరంగా సానుకూలత, ఎంఐసీఈ కార్యక్రమాలు పెరగడం, గత కొన్నేళ్లలో కొత్త కన్వెన్షన్ సెంటర్లు అందుబాటులోకి రావడం మధ్యకాలంలో ఆతిథ్య రంగంలో వృద్ధికి సానుకూలిస్తాయని ఇక్రా తెలిపింది. 2025–26లో ఆతిథ్య రంగం ఆదాయాలు, రుణ పరిస్థితులు స్థిరంగా ఉంటాయని పేర్కొంది. సానుకూల అవుట్లుక్ అన్నది సమీప కాలం నుంచి మధ్య కాలంలో అప్గ్రేడ్ను సూచిస్తే.. స్థిరమైన అవుట్లుక్ అన్నది సమీప కాలం నుంచి మధ్యకాలంలో మార్పులేమిని సూచిస్తుంది.
72–74 శాతం ఆక్యుపెన్సీ
దేశవ్యాప్తంగా ప్రీమియం హోటళ్లలో ఆక్యపెన్సీ (గదుల బుకింగ్) 2025–26 సంవత్సరంలో 72–74 శాతం మధ్య ఉండొచ్చన్నది ఇక్రా అంచనా. 2023–24లో నమోదైన 70–72 శాతంతో పోల్చితే కాస్త పెరగనుంది. ప్రీమియం హోటళ్లలో సగటు రూమ్ ధరలు రూ.8,200–8,500 మధ్య ఉండొచ్చని ఇక్రా తెలిపింది. 2024–25లో ఈ ధరలు రూ.8,000–8,200 మధ్య ఉన్నట్టు వెల్లడించింది. కొన్ని హోటళ్లు నవీకరణ చేపట్టడం, సరఫరా పెరగకపోవడంతో ధరలు పెరగనున్నట్టు పేర్కొంది. ‘‘మూడేళ్లపాటు వరుసగా బలమైన డిమాండ్ను ఆతిథ్య పరిశ్రమ చూసింది.
దేశీ విహార పర్యటనలు, సమావేశాలు, సదస్సులకు (ఎంఐసీఈ) డిమాండ్, వివాహాలు, వ్యాపార పర్యటనలు ఇందుకు అనుకూలించాయి. కానీ, 2025–26లో 6–8 శాతం మేర మోస్తరు వృద్ధికి పరిమితం కావొచ్చు’’అని ఇక్రా లిమిటెడ్ కార్పొరేట్ రేటింగ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జితిన్ మక్కర్ తెలిపారు. 2025 ఏప్రిల్లో పహల్గామ్ ఉగ్రదాడి, మే నెలలో ఉత్తర, పశి్చమ భారత్లో అనిశి్చతులు పెరగడంతో ప్రయాణ, ఎంఐసీఈ కార్యక్రమాల రద్దులు పెరిగినట్టు చెప్పారు. ఇటీవలి వారాల్లో డిమాండ్ కోలుకుంటున్నట్టు తెలిపారు. ఆదాయంలో వృద్ధి తక్కువగానే ఉన్నప్పటికీ.. 13 బడా హోటల్ కంపెనీలు 34–36 శాతం మధ్య మార్జిన్లు నమోదు చేయొచ్చని ఇక్రా అంచనా వేసింది. వ్యయ నియంత్రణలు, అస్సెట్ లైట్ (అద్దెకు తీసుకోవడం) నమూనా మార్జిన్లకు మద్దతునిస్తాయని తెలిపింది.