
మొత్తం రూ. 4,225 కోట్లు వెచ్చింపు
న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం హిందుస్తాన్ జింక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2025–26) తొలి మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. తాజాగా నిర్వహించిన వాటాదారుల సమావేశంలో డైరెక్టర్ల బోర్డు రూ. 2 ముఖవిలువగల షేరుకి 500 శాతం డివిడెండ్ను ఆమోదించినట్లు హిందుస్తాన్ జింక్ పేర్కొంది. దీంతో ప్రతీ షేరుకి రూ. 10 చొప్పున వాటాదారులకు చెల్లించనుంది. ఇందుకు వేదాంతా గ్రూప్ సంస్థ మొత్తం రూ. 4,225 కోట్లు వెచి్చంచనుంది. గతేడాది(2024–25) సైతం డివిడెండ్ల రూపేణా వాటాదారులకు మొత్తం రూ. 12,250 కోట్లు చెల్లించినట్లు కంపెనీ పేర్కొంది.
గతేడాది షేరుకి రూ. 19, రూ. 10 చొప్పున రెండుసార్లు డివిడెండ్ ప్రకటించింది. అత్యధిక డివిడెండ్ ఈల్డ్ అందిస్తున్న మెటల్ రంగ దిగ్గజాలలో కంపెనీ ఒకటికాగా.. తాజా డివిడెండ్ ప్రకటనతో ప్రభుత్వానికి రూ. 1,180 కోట్లు చెల్లించనుంది. కాగా.. వెండి ఉత్పత్తిని రెట్టింపునకు(రూ. 1,500–2,000 మెట్రిక్ టన్నులు) పెంచుకోవడంతోపాటు.. రాజస్తాన్లో ఎరువుల ప్లాంటును ఏర్పాటు చేసే ప్రణాళికల్లో ఉంది. కంపెనీ ఇటీవల రాజస్తాన్, యూపీ, ఆంధ్రప్రదేశ్లలో కీలకమైన మినరల్ బ్లాకులను సాధించిన విషయం విదితమే.
హిందుస్తాన్ జింక్ షేరు బీఎస్ఈలో 2.5 శాతం క్షీణించి రూ. 520 వద్ద ముగిసింది.