భారతదేశంలో పర్యావరణ హిత రవాణా వ్యవస్థలను ప్రోత్సహించే దిశగా.. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఇటీవల రెండు కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ కమ్యూటర్ మోటార్సైకిళ్లను లాంచ్ చేసింది. అవి ఒకటి స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్, రెండు హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్. కంపెనీ ఈ రెండు బైకులపై రూ.4,000 ప్రత్యేక తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్ జూలై 2026 వరకు అందుబాటులో ఉంటుంది.
ధరల తగ్గింపు కారణంగా.. హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ ధర రూ.82,710 నుంచి రూ.78,710కు తగ్గింది. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ధర రూ.72,792 నుంచి రూ.68,792కు చేరింది. దీంతో ఈ రెండు బైకులు సాధారణ వినియోగదారులకు మరింత అందుబాటులోకి వచ్చాయి.
ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ల ప్రత్యేకత
హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్లు E85 ఇంధనంతో పనిచేస్తాయి. E85 అంటే.. 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ కలయిక. సాధారణ పెట్రోల్ బైక్లతో పోలిస్తే ఈ విధమైన ఇంధనం పర్యావరణానికి కొంత తక్కువ హానికరం. కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
E85 ఇంధనాన్ని ఉపయోగించేందుకు హీరో మోటోకార్ప్ ఈ బైక్లలో కొన్ని సాంకేతిక మార్పులు చేసింది. వాటిలో ప్రత్యేక ఫ్యూయల్ పంప్, అదనపు ఫ్యూయల్ ఫిల్టర్, ఇంధన మిశ్రమాన్ని గుర్తించి తగిన విధంగా ఇంధన సరఫరాను నియంత్రించే రీక్యాలిబ్రేటెడ్ ECU (ఇంజిన్ కంట్రోల్ యూనిట్) వంటివి ఉన్నాయి.
ఇంజిన్ పనితీరు
ఈ రెండు బైక్లలో 97.2 సీసీ సామర్థ్యం గల ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ను అమర్చారు. E85 మోడ్లో ఈ ఇంజిన్ 8.4 బిహెచ్పీ పవర్, 8.3 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ప్రకారం.. E85 ఇంధనాన్ని ఉపయోగించినప్పుడు సాధారణ పెట్రోల్ మోడళ్లతో పోలిస్తే పవర్ 7 శాతం, టార్క్ 3 శాతం పెరుగుతాయి. అంటే.. ఈ బైక్లు పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, కొంత మెరుగైన పనితీరును కూడా అందిస్తాయి.
హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్, హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్లు జూలై 2026 నుంచి ముందుగా ఢిల్లీ, మహారాష్ట్రలలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి. ఆ తరువాత దేశంలోని ఇతర నగరాలు, రాష్ట్రాలకు కూడా విస్తరించనున్నారు.


