కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో గ్లోబల్ లీడర్గా నిలిచేందుకు గూగుల్ మాతృ సంస్థ ‘ఆల్ఫాబెట్ ఇంక్’ కళ్లు చెదిరే స్థాయి పెట్టుబడులకు తెరలేపింది. ఏఐ వ్యయ ప్రణాళికల కోసం నిధుల సమీకరణను భారీగా పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితమే ప్రకటించిన 80 బిలియన్ డాలర్ల ఆఫర్ను, తాజాగా 84.75 బిలియన్ డాలర్లకు (సుమారు 85 బిలియన్ డాలర్లు) పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది. సాధారణంగా భారీ టెక్ కంపెనీలు షేర్ల బైబ్యాక్లకే మొగ్గు చూపుతాయి. కానీ అందుకు భిన్నంగా ఆల్ఫాబెట్ ఇంత పెద్ద మొత్తంలో ఈక్విటీని ఆఫర్ చేయడం ద్వారా మార్కెట్ నుంచి నగదు సేకరించడం టెక్ చరిత్రలోనే అత్యంత అరుదైన పరిణామంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
నిధుల సమీకరణను విశ్లేషిస్తే..
ఈ మెగా ఫండ్ రైజింగ్ ప్లాన్ను ఆల్ఫాబెట్ అత్యంత వ్యూహాత్మకంగా విభజించింది. ఈ ఏడాది మూడో త్రైమాసికం (క్యూ3) నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రోగ్రామ్ ద్వారా బహిరంగ మార్కెట్లో నేరుగా వాటాలను విక్రయించి 40 బిలియన్ డాలర్లు సేకరిస్తారు. ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్కు చెందిన బెర్క్షైర్ హాత్వే ఇంక్తో 10 బిలియన్ డాలర్ల విలువైన భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. క్లాస్ ఏ కామన్ స్టాక్, క్లాస్ సీ క్యాపిటల్ షేర్ల రూపంలో 18 బిలియన్ డాలర్లను సేకరించబోతున్నట్లు తెలుస్తుంది. మిగిలిన 16.75 బిలియన్ డాలర్లను డిపాజిటరీ షేర్ల ద్వారా భర్తీ చేయనున్నారు.
మెగా డీల్
బ్లూమ్బెర్గ్ డేటా ప్రకారం.. ఆల్ఫాబెట్ గతంలో అనుకున్న 80 బిలియన్ డాలర్ల మార్కుతోనే గ్లోబల్ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద లావాదేవీగా రికార్డు సృష్టించడానికి సిద్ధమైంది. గతంలో బ్రెజిలియన్ చమురు దిగ్గజం ‘పెట్రోలియో బ్రెసిలిరో ఎస్ఏ’(పెట్రోబ్రాస్) సాధించిన 70 బిలియన్ డాలర్ల రికార్డు అమ్మకాలను ఆల్ఫాబెట్ తాజా ఆఫర్ వెనక్కి నెట్టేయనుంది.
సాధారణంగా గూగుల్ లాంటి క్యాష్-రిచ్ కంపెనీలు తమ షేర్ల విలువను పెంచడానికి బైబ్యాక్ విధానాన్ని ఎంచుకుంటాయి. కానీ, దానికి భిన్నంగా ఈక్విటీని విక్రయించి 85 బిలియన్ డాలర్ల భారీ నిధులు సమకూర్చుకుంటోందంటే.. ఏఐ రేసులో ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలవాలనే గూగుల్ దూకుడు స్పష్టమవుతోందని కొందరు నిపుణులు చెబుతున్నారు.
ఎన్విడియాకు గట్టి పోటీ.. సొంత చిప్లపై గురి!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ ప్రాసెసర్ల మార్కెట్లో ఎన్విడియా కార్ప్ ఆధిపత్యం నడుస్తోంది. అయితే, విపరీతమైన కంప్యూటింగ్ శక్తి అవసరమయ్యే ఈ పరిశ్రమలో ఎన్విడియాకు ప్రత్యామ్నాయంగా గూగుల్ తన సొంత ఏఐ చిప్లైన ‘టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లు’(టీపీయూ)పై దృష్టి పెట్టింది. ఈ అంతర్గత చిప్స్ టెక్నాలజీని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికే ఈ నిధులను ప్రధానంగా వినియోగించనున్నట్లు సమాచారం.
మరోవైపు, జనరేటివ్ ఏఐ సాంకేతికతను పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోవడానికి గూగుల్తో పాటు మైక్రోసాఫ్ట్, మెటా వంటి మెగా కంపెనీలు కూడా ఏఐ డేటా సెంటర్ల నిర్మాణంలో పోటీ పడుతున్నాయి. దీనివల్ల పరిశ్రమలో మూలధన వ్యయాలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి.
ఇదీ చదవండి: గేదె హెయిర్ స్టైల్కు ఫుల్ క్రేజ్!


