
రిటైల్ మార్కెట్లలో బంగారం ధరలు 10 గ్రాములకు రూ .1 లక్ష దాటిన నేపథ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీ జోహో వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీధర్ వెంబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగారంపై భారతదేశ సాంప్రదాయ విశ్వాసాన్ని ప్రశంసించారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలు, ఆర్థికవేత్తలు, బిట్కాయిన్లను తీసిపారేస్తూ వాఖ్యానించారు.
బంగారం ధర రూ.లక్షను దాటిన క్రమంలో కోటక్ మహింద్రా బ్యాంక్ ఫౌండర్, డైరెక్టర్ ఉదయ్ కోటక్.. భారతీయ గృహిణి తెలివైన ఫండ్ మేనేజర్ అంటూ ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆయన అభిప్రాయాన్ని సమర్థిస్తూ శ్రీధర్ వెంబు కూడా ‘ఎక్స్’లో మరో పోస్ట్ పెట్టారు.
"బంగారం రూ .1 లక్షను దాటడంతో ఉదయ్ కోటక్ భారతీయ గృహిణిని తెలివైన ఫండ్ మేనేజర్గా ప్రశంసించారు. ఉదయ్ కోటక్ గారితో నేను మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను. భారతీయులకు బంగారంపై ఉన్న ప్రేమ, కాగితపు ఆస్తులపై ఉన్న అపనమ్మకమే మన దీర్ఘకాలిక సుస్థిరతకు, నాగరికత కొనసాగింపునకు పునాది" అని రాసుకొచ్చారు.
ఇది చదివారా? ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’
కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు, పీహెచ్డీ ఆర్థికవేత్తలకు, వారి ఫ్యాన్సీ సిద్ధాంతాలకు డబ్బు చాలా ముఖ్యమైనది. ఇక తన లాంటి సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అయితే బిట్ కాయిన్ వైపు చూస్తున్నారని రాసుకొచ్చిన ఆయన 'బంగారమే డబ్బు' అంటూ పేర్కొన్నారు. సామాన్య భారతీయుడికి ఈ విషయం (బంగారం విలువ) తెలుసు. ఓవైపు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అధ్వాన్నంగా మారుతున్నప్పటికీ భారత్ స్థిరత్వం బంగారం నుంచే వచ్చిందంటూ పోస్టును ముగించారు.
బంగారం ధర మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సోమవారం ఎంసీఎక్స్లో గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.99,178 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది. భౌతిక మార్కెట్లో, బంగారం 10 గ్రాములకు రూ .97,200 వద్ద ట్రేడ్ అయింది. దీనికి 3% జీఎస్టీ కలిపిన తర్వాత తుది రిటైల్ ధర రూ.1 లక్ష దాటింది.