జెన్సోల్‌.. ఓ ఉత్తుత్తి కంపెనీ! | Gensol Misled Investors, No Manufacturing At Pune EV Plant says SEBI | Sakshi
Sakshi News home page

జెన్సోల్‌.. ఓ ఉత్తుత్తి కంపెనీ!

Apr 21 2025 4:56 AM | Updated on Apr 21 2025 4:56 AM

Gensol Misled Investors, No Manufacturing At Pune EV Plant says SEBI

పుణె ఈవీ ప్లాంట్‌లో ఉత్పత్తి నిల్‌... 

ఉన్నది ఇద్దరు ముగ్గురు కార్మికులే

ఎన్‌ఎస్‌ఈ అధికారి తనిఖీల్లో బట్టబయలు... 

గతంలో 30,000 ఈవీలకు ప్రి–ఆర్డర్లు ఉన్నాయని ప్రకటించిన జెన్సోల్‌ 

అదంతా బోగస్‌ అని బయటపెట్టిన సెబీ 

ముంబై: కంపెనీ నిధులను ఇష్టాసారం వాడేసుకుని, ఇన్వెస్టర్లను నిండా ముంచేసిన జోన్సోల్‌ ఇంజినీరింగ్‌ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కంపెనీ షేరు ధరతో పాటు నిధుల్లో గోల్‌మాల్‌ చోటు చేసుకుందని గతేడాది జూన్‌లో సెబీకి అందిన ఫిర్యాదుపై మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 

నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ)అధికారి పుణెలోని కంపెనీ ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) ప్లాంట్‌లో జరిపిన తనిఖీల్లో అసలు ఎలాంటి తయారీ కార్యకలాపాలు లేనట్లు బట్టబయలైంది. అలాగే, అక్కడ కేవలం ఇద్దరు ముగ్గురు కార్మికులు మాత్రమే ఉన్నారని ఈ నెల 15న సెబీ జారీ చేసిన మధ్యంతర ఆదేశాల్లో సెబీ వెల్లడించింది. జెన్సోల్‌ ప్రమోటర్లు అన్మోల్‌ సింగ్‌ జగ్గీ, పునీత్‌ సింగ్‌ జగ్గీ.. కంపెనీ నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడటమే కాకుండా ఇన్వెస్టర్లను పక్కదారి పట్టించిన విషయాన్ని నియంత్రణ సంస్థ బయటపెట్టింది. 

తవ్వేకొద్దీ... 
సెబీ తరఫున ఎస్‌ఎస్‌ఈ అధికారి ఈ నెల 9న పుణె దగ్గర్లోని చకన్‌ వద్దనున్న జెన్సోల్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్లాంట్‌లో విచారణ చేపట్టారు. ‘ఈ సందర్భంగా అక్కడ ఉత్పత్తి కార్యకపాపాలు ఏవీ కనబడలేదు. ఇద్దరు ముగ్గురు కార్మికులే ఉన్నారు. దీంతో గత 12 నెలల కరెంట్‌ బిల్లులను అధికారి కోరగా 2024 ఏడాది డిసెంబర్‌ నెలలో మాత్రమే అత్యధికంగా రూ.1,57,037 మొత్తాన్ని ఈ యూనిట్‌ చెల్లించినట్లు వెల్లడైంది‘ అని సెబీ తెలిపింది.

 కాగా, ఈ ఏడాది జనవరిలో జరిగిన భారత్‌ మొబిలిటీ ఎక్స్‌పోలో జెన్సోల్‌ కొత్త ఈవీని ప్రదర్శించడమే కాకుండా, దాదాపు 30,000 ఈవీలకు ప్రి–ఆర్డర్లు కూడా వచ్చాయని స్టాక్‌ ఎక్సే్చంజీలకు తెలియజేయడం గమనార్హం. అయితే, కంపెనీ డాక్యుమెంట్ల ప్రకారం 29,000 ఈవీల కొనుగోలుకు వ్యక్తం చేసిన 9 సంస్థలతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) మాత్రమే కుదిరినట్లు సెబీ గుర్తించింది. ఎలాంటి ధర, డెలివరీ తేదీలు లేకపోవడాన్ని చూస్తే, ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించిన విషయం స్పష్టమవుతోందని సెబీ పేర్కొంది. 

జెన్సోల్‌ ప్రమోటర్లు జగ్గీ బ్రదర్స్‌ 6,400 ఈవీలను కొనుగోలు చేయడం కోసం ఇరెడా, పీఎఫ్‌సీ నుంచి 978 కోట్ల రుణాలు తీసుకుని కేవలం 4,704 ఈవీలను మాత్రమే (రూ.568 కోట్లు) కొనుగోలు చేసిన విషయం సెబీ దర్యాప్తులో తాజాగా బయటపడిన విషయం తెలిసిందే. మిగతా నిధులను పక్కదారి పట్టించి, జగ్గీ బ్రదర్స్‌ సొంతానికి వాడేసుకున్నట్లు కూడా సెబీ తేల్చింది. దీంతో జెన్సోల్‌ సహా ప్రమోటర్లను సెక్యూరిటీస్‌ మార్కెట్‌ నుంచి నిషేధించడంతో పాటు జగ్గీ సోదరులు కంపెనీలో ఎలాంటి పదవులూ చేపట్టకుండా కఠిన చర్యలు చేపట్టింది. దీంతో ప్రమోటర్లు తమ డైరెక్టర్‌ పదవులను రాజీనామా చేశారు, మరోపక్క, జెన్సోల్‌ ఇంజినీరింగ్‌ షేరు విభజన ప్రణాళికను కూడా సెబీ పక్కనబెట్టింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement