రూ.1.33–1.61 లక్షల కోట్ల అదనపు ప్రయోజనం
ఈవై పార్ధెనాన్–క్రెడాయ్ సంయుక్త నివేదిక
న్యూఢిల్లీ: జెనరేటివ్ ఏఐతో భారత రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ప్రయోజనం చేకూరనుంది. ఈ సాంకేతికత రియల్ ఎస్టేట్ సంస్థల నిర్వహణ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని, తద్వారా రాబోయే ఏడేళ్లలో 14 నుంచి 17 బిలియన్ డాలర్ల వరకు (రూ. 1.33–1.61 లక్షల కోట్ల) అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఈవై పార్థెనాన్, క్రెడాయ్ సంయుక్త నివేదిక అంచనా వేసింది. జెనరేటివ్ ఏఐతో నిర్మాణ రంగం పనితీరు మెరుగుపడటమే కాకుండా, అమ్మకాల వేగం 30 – 50 శాతం వరకు పెరుగుతుందని స్పష్టం చేసింది.
నివేదికలోని ముఖ్యాంశాలు..
జెనరేటివ్ ఏఐ వినియోగంతో ఇళ్ల అమ్మకాల వేగం పెరగడమే కాకుండా, కొత్త ప్రాజెక్టులను మార్కెట్లోకి ప్రవేశపెట్టే సమయం 30 శాతం వరకు తగ్గుతుంది.
వచ్చే ఏడేళ్లలో రియల్ ఎస్టేట్ రంగం నమోదు చేసే మొత్తం స్థూల విలువ జోడింపులో జెనరేటివ్ ఏఐ రూపంలో 3–4 శాతంగా ఉంటుంది.
భూమి కొనుగోలు నుంచి ప్రాజెక్ట్ ప్రారంభించే మధ్య కాలవ్యవధి 20–30 శాతం వరకు తగ్గుతుంది. అలాగే నిర్మాణ వ్యయం, కాలపరిమితిలోనూ 5 నుంచి 20 శాతం వరకు ఆదా అవుతుంది.
ప్రస్తుత డేటా ఆధారంగా కొత్త ఐడియాలు, డిజైన్ల సృష్టిలో సాయపడుతుంది.
రంగం ముఖచిత్రానే మార్చేస్తుంది..
రియల్ ఎస్టేట్ రంగంలో తదుపరి వృద్ధి కేవలం వ్యాపార విస్తరణ పైనే కాకుండా, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సరైన నిర్ణయాలను వేగంగా తీసుకోవడం పైనే ఆధారపడి ఉంటుందని ఈ నివేదిక విడుదల సందర్భంగా క్రెడాయ్ అధ్యక్షుడు శేఖర్ జి పటేల్ చెప్పారు. ‘‘నిర్వహణ సామర్థ్యంతోపాటు ప్రణాళిక, డిజైన్, నిర్మాణం, విక్రయాలు, కస్టమర్లతో సంబంధాలు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా స్పందించంలోనూ జెనరేటివ్ ఏఐ కీలక పాత్ర పోషించనుంది’’అని వివరించారు.


