
అదానీ గ్రూప్ చైర్మన్, దేశంలోనే రెండో అత్యంత ధనవంతుడైన గౌతమ్ అదానీ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ .10.41 కోట్ల వేతనం అందుకున్నారు. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 12 శాతం పెరిగింది. అదానీ గ్రూప్లోని తొమ్మిది లిస్టెడ్ కంపెనీల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (రూ.2.54 కోట్లు), అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ (రూ.7.87 కోట్లు) నుంచి ఆయనకీ ఆదాయం వచ్చింది.

గతంతో పోలిస్తే ఈసారి వేతనం పెరిగినప్పటికీ, అదానీ పారితోషికం దేశంలోని చాలా మంది అగ్రశ్రేణి పారిశ్రామిక అధినేతల కంటే చాలా తక్కువ కావడం గమనార్హం. తోటి వ్యాపారాధినేతలైన సునీల్ భారతి మిట్టల్ (2024 ఆర్థిక సంవత్సరంలో రూ.32.27 కోట్లు), రాజీవ్ బజాజ్ (2024 ఆర్థిక సంవత్సరంలో రూ.53.75 కోట్లు), పవన్ ముంజాల్ (2024 ఆర్థిక సంవత్సరంలో రూ.109 కోట్లు), ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యన్ (2025 ఆర్థిక సంవత్సరంలో రూ.76.25 కోట్లు), ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ ఎస్ పరేఖ్ (2025 ఆర్థిక సంవత్సరంలో రూ.80.62 కోట్లు) వంటి వారు అదానీ కంటే ఎక్కువ వేతనం అందుకున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తన గ్రూప్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్లలో కొంతమంది అదానీ కంటే ఎక్కువ పారితోషిక ప్యాకేజీలను అందుకున్నారు. ఏఈఎల్ సీఈవో వినయ్ ప్రకాశ్ రూ.69.34 కోట్లు, అదానీ గ్రీన్ ఎనర్జీ ఎండీ వినీత్ ఎస్ జైన్ రూ.11.23 కోట్లు ఆర్జించారు. ఇది భారతదేశ కార్పొరేట్ నాయకత్వంలోని విభిన్న వేతన నిర్మాణాలను హైలైట్ చేస్తుంది. ఇక్కడ కొంతమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లు వేతన ఆధారిత సంపాదనలో కంపెనీ వ్యవస్థాపకులనే అధిగమిస్తుండటం గమనించవచ్చు.