
దేశీ కార్పొరేట్లు అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం భారీగా నిధులు సమీకరించాయి. ప్రధానంగా దేశీ స్టాక్ మార్కెట్ల దూకుడు ప్రభావంతో 2024–25లో 85 కంపెనీలు రూ.1,33,251 కోట్లు సమకూర్చుకున్నాయి. ఇది సరికొత్త రికార్డ్కాగా.. అంతక్రితం ఏడాది(2023–24)లో 64 కంపెనీలు క్విప్ ద్వారా అందుకున్న రూ.71,306 కోట్లతో పోలిస్తే ఇవి 87 శాతం వృద్ధికావడం గమనార్హం! ప్రైమ్ డేటాబేస్ గణాంకాల ప్రకారం ఈక్విటీ మార్కెట్ దన్నుతో కంపెనీలు బ్యాలెన్స్ షీట్ను పటిష్టపరచుకోవడంతోపాటు.. విస్తరణకు అవసరమైన నిధులను సమకూర్చుకున్నాయి. వెరసి గతేడాది అటు విలువలోనూ, ఇటు సంఖ్యలోనూ దేశీ కార్పొరేట్లు క్విప్ నిధులలో సరికొత్త రికార్డుకు తెరతీసినట్లు జేఎమ్ ఫైనాన్షియల్ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ నేహా అగర్వాల్ పేర్కొన్నారు.
క్విక్గా..
లిస్టెడ్ కంపెనీలు, ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు వేగవంతంగా పెట్టుబడులను సమకూర్చుకునేందుకు క్విప్ మార్గాన్ని ఎంచుకుంటాయి. ప్రధానంగా సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపుల ద్వారా నిధులు సమీకరించే సంగతి తెలిసిందే. ఇందుకు సెబీ తదితర మార్కెట్ నియంత్రణ సంస్థలకు ముందస్తుగా దరఖాస్తు చేయవలసిన అవసరంలేకపోవడంతో లిస్టెడ్ కంపెనీలు ఆసక్తి చూపుతుంటాయని విశ్లేషకులు వివరించారు. గతేడాది ప్రధానంగా ప్రభుత్వరంగ బ్యాంకులు, మెటల్స్, ఆటోమొబైల్స్, యుటిలిటీస్, రియల్ ఎస్టేట్ రంగాల కంపెనీలు అధికంగా క్విప్ చేపట్టాయి. నిధుల సమీకరణకు ఈక్విటీ ప్రధాన వనరుగా మారడంతో లిస్టెడ్ కంపెనీలు క్విప్నకు ఆసక్తి చూపినట్లు నిపుణులు తెలియజేశారు. తద్వారా వృద్ధి, విస్తరణ, ఇతర కంపెనీల కొనుగోళ్లు తదితరాలకు నిధులను వెచ్చించనున్నట్లు తెలియజేశారు.
జేఎమ్ జోరు
క్విప్ నిధుల సమీకరణలో డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంత గ్రూప్, ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో అగ్ర స్థానంలో నిలిచాయి. గత ఆర్థిక సంవత్సరంలో రెండు కంపెనీలు విడిగా రూ.8,500 కోట్లు చొప్పున సమీకరించాయి. ఈ బాటలో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ రూ. 8,373 కోట్లు, వరుణ్ బెవరేజెస్ రూ. 7,500 కోట్లు, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ రూ. 6,438 కోట్లు, గోద్రేజ్ ప్రాపరీ్టస్ రూ. 6,000 కోట్లు, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ రూ. 5,000 కోట్లు చొప్పున అందుకున్నాయి.
ఇదీ చదవండి: తండ్రి అయినంత మాత్రాన ఉద్యోగం ఇవ్వాలా?
పీఎస్యూలు
గతేడాది క్విప్ ద్వారా పీఎస్యూ బ్యాంకులు పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యుకో, ఐఓబీ, సెంట్రల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ సైతం ఉమ్మడిగా రూ.14,000 కోట్లకు పైగా సమీరించాయి. అంతేకాకుండా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, బ్రూక్ఫీల్డ్ ఇండియా రీట్, టొరెంట్ పవర్, భారత్ ఫోర్జ్ సైతం క్విప్ మార్గాన్ని ఎంచుకున్నాయి. అత్యధిక క్విప్ల నిర్వహణ ద్వారా జేఎమ్ ఫైనాన్షియల్ ప్రధాన పాత్ర పోషించింది. ప్రైమ్ డేటాబేస్ వివరాల ప్రకారం ఫిబ్రవరివరకూ చూస్తే జేఎమ్ 15 ఇష్యూలను నిర్వహించింది. తద్వారా 4.5 బిలియన్ డాలర్లు(రూ. 38,693 కోట్లు) సమీకరణలో సహకారం అందించింది. ప్రస్తుత ఆ ర్థిక సంత్సరం(2025–26)లో క్విప్లు, ఐపీవోల ద్వారా రూ. 3 లక్షల కోట్లకుపైగా నిధుల సమీకరణకు వీలున్నట్లు దేశీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ అసోసియేషన్(ఏఐబీఐ) అంచనాల వేయడం విశేషం!