జీవితంలో కొన్ని అవకాశాలు కోల్పోతే.. ఎప్పటికీ తిరిగి రావు. అలాంటి ఒక సంఘటనను భారతదేశానికి చెందిన అమెరికాలోని ఒక పాఠశాల వ్యవస్థాపకురాలు, సీఈఓ స్నేహా బిస్వాస్ తాజాగా గుర్తు చేసుకున్నారు. ఆమెకు.. దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటాను వ్యక్తిగతంగా కలిసే అవకాశం వచ్చినప్పటికీ, కొన్ని పరిస్థితుల కారణంగా కలుసుకోలేక పోయారు. ఈ విషయం ఇప్పటికీ తన జీవితంలో పెద్ద లోటుగా మిగిలిపోయిందని ఆమె వెల్లడించారు.
స్నేహా బిస్వాస్ 2020 జనవరిలో టాటా స్టీల్లో ఇంటర్న్గా పనిచేస్తున్న సమయంలో రతన్ టాటాకు ఒక ఈమెయిల్ పంపారు. సాధారణంగా ఇలాంటి ప్రముఖులకు రోజూ వందలాది మెయిల్స్ వస్తుంటాయి. అయితే ఆశ్చర్యకరంగా రతన్ టాటా స్వయంగా ఆమె మెయిల్ను చదివి సమాధానం పంపారు. 'మిమ్మల్ని కలిసేందుకు ప్రయత్నిస్తాను. మీ భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు” అని ఆయన రాసిన సందేశం స్నేహాను ఎంతో ఆశ్చర్యపరిచింది.
ఆమెను ఎక్కువగా ఆకట్టుకున్న విషయం రతన్ టాటా వినయం. 82 ఏళ్ల వయస్సులో కూడా ఒక ఇంటర్న్ పంపిన మెయిల్ను చదివి స్పందించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. చాలా మంది నాయకులు తమకంటే చిన్నవారిని పట్టించుకోకపోయినా, రతన్ టాటా మాత్రం ప్రతి వ్యక్తిని గౌరవంగా చూసేవారని ఆమె అన్నారు.
ఈ సంఘటన తర్వాత రతన్ టాటా ఆఫీస్ నుంచి ఆమెకు ఫోన్ కాల్ కూడా వచ్చింది. టాటా ఆమెను కలవాలనుకుంటున్నారని, సమావేశానికి అనువైన తేదీ చెప్పాలని కోరారు. అయితే అదే రోజున స్నేహా అమెరికాకు తిరిగి వెళ్లాల్సి ఉండటంతో ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది. 'తర్వాత కలుసుకోవచ్చు' అని అనుకున్నప్పటికీ, ఆ అవకాశం మళ్లీ రాలేదు.
తర్వాతి సంవత్సరాల్లో అమెరికాలోనే ఉండి తన వ్యాపార కార్యకలాపాల్లో స్నేహా బిజీ అయిపోయారు. ఇదే సమయంలో 2024 అక్టోబర్ 9న 86 ఏళ్ల వయస్సులో రతన్ టాటా కన్నుమూశారు. దీంతో ఆయనను ప్రత్యక్షంగా కలవాలనే కోరిక శాశ్వతంగా నెరవేరకుండా పోయింది.
అయితే ఈ అనుభవం తనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిందని స్నేహా చెప్పారు. నిజమైన నాయకత్వం అంటే కేవలం వ్యాపార విజయాలు కాదు, వినయం, దయ, ప్రతి వ్యక్తిని గౌరవించే మనస్తత్వం కూడా కావాలని ఆమె అభిప్రాయపడ్డారు. రతన్ టాటా నుంచి వచ్చిన ఆ ఈమెయిల్ను ఇప్పటికీ చదువుతుంటానని, అది తనకు స్ఫూర్తినిస్తుందని ఆమె తెలిపారు.
ఇదీ చదవండి: 80 గంటల పని.. అమెజాన్ అనుభవాలు చెప్పిన సీఈవో!


