వెయ్యి మైక్రో ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలకు ‘ఫ్లిప్‌కార్ట్ మినిట్స్’‌ | Flipkart Minutes crosses 1000 Micro Fulfilment Centers in under two years | Sakshi
Sakshi News home page

వెయ్యి మైక్రో ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలకు ‘ఫ్లిప్‌కార్ట్ మినిట్స్’‌

Jun 25 2026 1:06 PM | Updated on Jun 25 2026 1:11 PM

Flipkart Minutes crosses 1000 Micro Fulfilment Centers in under two years

బెంగళూరు: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన క్విక్ కామర్స్ సర్వీస్‌ ‘ఫ్లిప్‌కార్ట్ మినిట్స్’ ప్రారంభమై రెండేళ్లు కూడా పూర్తికాకముందే దేశవ్యాప్తంగా 1,000 మైక్రో ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాల మైలురాయిని చేరుకుంది. 2024 ఆగస్టులో ప్రారంభమైన ఈ సర్వీస్‌  ప్రస్తుతం 130కుపైగా నగరాలు, 8,000కుపైగా పిన్‌కోడ్లకు విస్తరించింది. నెట్‌వర్క్ విస్తరణతో గత ఏడాదితో పోలిస్తే ఆర్డర్ల సంఖ్య ఐదు రెట్లు పెరిగింది.

ప్రత్యేకంగా టైర్-2, టైర్-3 నగరాల్లో ఫ్లిప్‌కార్ట్ మినిట్స్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. అంబాలా, ఆరా, బొకారో, దర్భంగా, జోర్హాట్, ఒంగోలు, పూర్ణియా, సహర్సా, తెనాలి వంటి నగరాల్లో డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ విభాగాల్లో వ్యాపారం గత ఏడాదితో పోలిస్తే 42 రెట్లు విస్తరించినట్లు సంస్థ వెల్లడించింది. గత ఏడాదిలోనే 90కుపైగా కొత్త నగరాలను తన నెట్‌వర్క్‌లో చేర్చుకుంది.

సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. జెన్-జీ వినియోగదారులు అత్యంత వేగంగా పెరుగుతున్న కస్టమర్ వర్గంగా నిలిచారు. ప్రస్తుతం మొత్తం వినియోగదారుల్లో 40 శాతానికి పైగా ఈ వర్గానికే చెందినవారు. కేవలం నిత్యావసర వస్తువులకే పరిమితం కాకుండా ఎలక్ట్రానిక్స్, బ్యూటీ, వెల్‌నెస్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను కూడా వేగంగా ఆర్డర్ చేస్తున్నారు. పండ్లు, కూరగాయల విభాగంలో సగటు ఆర్డర్ విలువ 30 శాతం పెరగగా, పునరావృత కొనుగోళ్లు 20 శాతానికి పైగా వృద్ధి చెందాయి. ప్రస్తుతం 250కుపైగా ఉత్పత్తి విభాగాల్లో సేవలు అందిస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ 500కుపైగా డీ2సీ బ్రాండ్లతో భాగస్వామ్యం కలిగి ఉండగా, ‘సమర్థ్ కృషి’ కార్యక్రమం ద్వారా 3,000కుపైగా రైతులను మార్కెట్‌తో అనుసంధానిస్తోంది. అలాగే విద్యుత్ వాహనాల వినియోగాన్ని రెట్టింపు చేసి, 10 శాతానికి పైగా డెలివరీలను గ్రీన్ డెలివరీలుగా నిర్వహిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement