దేశీయ ఈ-కామర్స్ రంగంలో తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో ఫ్లిప్కార్ట్ విక్రేతలకు (సెల్లర్లు) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్లాట్ఫామ్పై వ్యాపారాన్ని మరింత సులభతరం చేయడంతోపాటు విక్రేతలకు మరిన్ని లాభాలను చేకూర్చే లక్ష్యంతో తన ‘జీరో-కమీషన్’ విధానాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు కేవలం రూ.1,000 లోపు ధర గల ఫ్యాషన్ ఉత్పత్తులకే పరిమితమైన ఈ జీరో కమీషన్ నిబంధనను ఇకపై ధరతో నిమిత్తం లేకుండా అన్ని రకాల ఫ్యాషన్ ఉత్పత్తులకు వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది.
90,000 మంది విక్రేతలకు ఉపశమనం
ఫ్లిప్కార్ట్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఫ్యాషన్ విభాగంలో వ్యాపారం చేస్తున్న సుమారు 90,000 మందికి పైగా యాక్టివ్ విక్రేతలు నేరుగా లబ్ధి పొందనున్నారు. గతంలో రూ.1,000 దాటిన ఉత్పత్తులపై కంపెనీకి కమీషన్ చెల్లించాల్సి వచ్చేది. కానీ తాజా నిర్ణయంతో, విక్రేతలు తాము అమ్మే ప్రతి ఫ్యాషన్ ప్రొడక్ట్పై పూర్తి మార్జిన్లను (లాభాలను) తామే నిలుపుకునే అవకాశం లభించింది. ఇది ఎంఎస్ఎమ్ఈలు, స్థానిక బ్రాండ్లు, తయారీదారులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.
దీర్ఘకాలిక పెట్టుబడే లక్ష్యం
ఈ వ్యూహాత్మక మార్పుపై ఫ్లిప్కార్ట్ ఫ్యాషన్ వైస్ ప్రెసిడెంట్ కపిల్ తిరానీ మాట్లాడుతూ.. ‘మా వ్యాపార భాగస్వాముల ప్రయోజనాలకే ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యం ఇస్తాం. ఈ సెల్లర్-ఫస్ట్ చొరవను మొత్తం ఫ్యాషన్ విభాగానికి విస్తరించడం ద్వారా మా అమ్మకందారులకు మరిన్ని ప్రయోజనాలు చేకూరుస్తాం. దీనివల్ల విక్రేతలు సరికొత్త ఆవిష్కరణలు చేయడం, ప్రొడక్ట్ రేంజ్ను విస్తరించడం, తమ సొంత బ్రాండ్ బిల్డింగ్పై మరింత నమ్మకంతో పెట్టుబడులు పెట్టడానికి వీలవుతుంది’ అన్నారు.
ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే..


