నిర్మలా సీతారామన్‌ మొరాకో పర్యటన నేటి నుంచి | Finance Minister Nirmala Sitharaman to embark on 6-day visit to Morocco | Sakshi
Sakshi News home page

నిర్మలా సీతారామన్‌ మొరాకో పర్యటన నేటి నుంచి

Oct 10 2023 6:24 AM | Updated on Oct 10 2023 10:16 AM

Finance Minister Nirmala Sitharaman to embark on 6-day visit to Morocco - Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం ఆరు రోజుల పర్యటన నిమిత్తం మొరాకో బయలుదేరనున్నారు. ఆ దేశ ఆర్థిక రాజధాని మారకేచ్‌లో ఈ  ఆరు రోజుల అధికారిక పర్యటనను ప్రారంభించనున్నారు. జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్‌ బ్యాంకుల గవర్నర్‌ల (ఎఫ్‌ఎంసీబీజీ) సమావేశంతో పాటు ప్రపంచ బ్యాంక్‌–అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సంస్థ వార్షిక సమావేశంలో ఆర్థికమంత్రి పాల్గొననున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి.

దీనితోపాటు ఇండోనేషియా, మొరాకో, బ్రెజిల్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్‌లతో భారత్‌ ద్వైపాక్షిక సమావేశాలు  అక్టోబర్‌ 11–15 తేదీల మధ్య మరకేచ్‌లో జరగనున్నాయి. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్‌ వార్షిక సమావేశాల కోసం వెళుతున్న భారత ప్రతినిధి బృందానికి ఆర్థిక మంత్రి నాయకత్వం వహిస్తున్నారు.  ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) అధికారులు ఈ ప్రతినిధి బృందంలో సభ్యులుగా ఉంటారని ఒక అధికారిక ప్రకటన తెలిపింది.

ఈ పర్యటనలో, సీతారామన్, ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నాల్గవ జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్ల  సమావేశానికి సహ అధ్యక్షత వహిస్తారు.ఈ సమావేశంలో జీ20 దేశాలు, ఆహా్వనిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుండి దాదాపు 65 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. అంతర్జాతీయ సమస్యలు, సవాళ్లు, ఆర్థిక అనిశి్చతి, బహుళజాతి బ్యాంకుల పటిష్టత, క్రిప్టో కరెన్సీ వంటి అంశాలు ఈ సమావేశాల చర్చల్లో ప్రధాన భాగం కానున్నాయి. బహుళజాతి బ్యాంకుల పటిష్టతకు సంబంధించి నిపుణుల గ్రూప్‌ రూపొందించిన రెండవ వ్యాల్యూమ్‌ నివేదిక ఈ సమావేశాల్లో విడుదల కానుంది. మొదటి వ్యాల్యూమ్‌ నివేదిక గుజరాత్‌ గాం«దీనగర్‌లో జూలైలో జరిగిన మూడవ ఎఫ్‌ఎంసీబీజీ సమావేశాల్లో విడుదలైన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement