రోజుకు 4,591 ఈవీలు | EV sales in India jump 42percent to 1. 67 million in FY2024 | Sakshi
Sakshi News home page

రోజుకు 4,591 ఈవీలు

Apr 5 2024 4:55 AM | Updated on Apr 5 2024 11:49 AM

EV sales in India jump 42percent to 1. 67 million in FY2024 - Sakshi

వేగం పుంజుకున్న ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌

రెండేళ్లలో 29,59,218 ఈవీల పరుగు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ (ఈవీ) పరుగు జోరుగా సాగుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ప్రతిరోజూ 4,591 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022–23లో ఈ సంఖ్య 3,242 యూనిట్లు. మార్చి నెలలో ఏకంగా 2,08, 410 యూనిట్ల అమ్మకాలు తోడవడంతో.. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం దేశవ్యాప్తంగా 16, 75,700 యూనిట్ల ఈవీలు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లా యి. 2022–23తో పోలిస్తే ఇది 41 శాతం అధికం కావడం విశేషం. దేశ ఈవీ చరిత్రలో 2024 మార్చి నెలతోపాటు 2023–24 ఆర్థిక సంవత్సరం అత్యధి క విక్రయాలను నమోదు చేసింది. ఇక భారత్‌లో 2023–24లో అన్ని రకాల వాహన విభాగాల్లో కలిపి 2,45,26,468 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇందులో ఈవీల వాటా 6.78 శాతానికి చేరడం విశేషం.   

విభాగాల వారీగా ఇలా..
ఎలక్ట్రిక్‌ వాహన విభాగంలో గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో 9,44,082 టూ వీలర్లు అమ్ముడయ్యాయి. 2022–23తో పోలిస్తే ఇది 29 శాతం అధికం. అలాగే 57 శాతం వృద్ధితో 6,32,485 యూనిట్ల త్రిచక్ర వాహనాలు విక్రయం అయ్యా­యి. మొత్తం ఈవీల్లో ద్విచక్ర, త్రిచక్ర వాహనాల వాటా ఏకంగా 94 శాతం ఉంది. ఇక ప్యాసింజర్‌ వెహికిల్స్‌ 90,379 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏడాదిలో ఈ–ప్యాసింజర్‌ కార్స్, ఎస్‌యూవీల సంఖ్య 89 శాతం దూసుకెళ్లడం విశేషం. ఈ–బస్‌లు 3,693 యూనిట్లు, హెవీ గూడ్స్‌ వెహికిల్స్‌ 240, తేలికపాటి సరుకు వాహనాలు 4,699, ఇతర వాహనాలు 122 యూనిట్లు విక్రయం అయ్యాయి.  

పుంజుకున్న డిమాండ్‌..
దేశంలో 2014–15 నుంచి 2024 మార్చి వరకు 39,55,021 యూనిట్ల ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ రోడ్డెక్కాయి. ఇందులో 72 శాతం అంటే 29,59,218 యూనిట్లు గడిచి­న రెండు ఆర్థిక సంవత్సరాల్లో తోడయ్యా­యం­టే ఈవీల విభాగం ఏ స్థాయిలో వే­గం పుంజుకుందో అర్థం చేసుకోవచ్చు. 2013–14లో మొత్తం 2,627 యూనిట్ల ఈవీలు అమ్ముడయ్యాయి. ఈ–కామర్స్‌ పరిశ్రమ, సరుకు రవాణా కంపెనీల నుండి ద్విచక్ర, త్రిచక్ర ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ కోసం, అలాగే టాక్సీ ఫ్లీట్‌ ఆపరేటర్ల నుండి ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వాహనాల కోసం వేగంగా డి మాండ్‌ వస్తోంది. 2030 నాటికి ఈవీల వా టా వాణిజ్య వాహనాల్లో 70 శాతం, ప్యాసింజర్‌ వెహికిల్స్‌లో 30, బస్‌లలో 40, ద్విచక్ర, త్రిచక్ర వాహన విభాగంలో 80 శాతానికి చేర్చాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement