
ప్రాజెక్టుపై కసరత్తు చేస్తున్న కార్మిక శాఖ
ఆటో–సెటిల్మెంట్ కింద పరిమితి రూ. 5 లక్షలకు పెంపు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్వో చందాదారులకు శుభవార్త. ఏటీఎంలు, యూపీఐ తదితర మాధ్యమాల ద్వారా తమ ఖాతాల నుంచి ఈపీఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఉద్యోగులు తమ బ్యాంకు ఖాతాలను ఈపీఎఫ్కు అనుసంధానించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుపై కార్మిక శాఖ కసరత్తు చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం ఈపీఎఫ్లో నిర్దిష్ట నిష్పత్తిలో కొంత భాగాన్ని పక్కన పెట్టి, మిగతా మొత్తాన్ని విత్డ్రాయల్కు అందుబాటులో ఉంచుతారని పేర్కొన్నాయి.
ఏటీఎం డెబిట్ కార్డులు, యూపీఐలాంటి మాధ్యమాల ద్వారా బ్యాంక్ అకౌంట్ నుంచి ఆ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చని వివరించాయి. ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రస్తుతం సాఫ్ట్వేర్పరమైన సవాళ్లు ఉన్నాయని, వాటిని పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపాయి. ఈపీఎఫ్వోకి బ్యాంకింగ్ లైసెన్సులు లేనందువల్ల ఈపీఎఫ్ ఖాతాల నుంచి నేరుగా ఉపసంహరించుకునేందుకు వీలుండదని సంబంధిత వర్గాలు చెప్పాయి.
మరోవైపు, ఆటో–సెటిల్మెంట్ విధానం కింద విత్డ్రాయల్ పరిమితిని ప్రస్తుతమున్న రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచారు. ఆటో–సెటిల్మెంట్ విధానంలో దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల వ్యవధిలోనే క్లెయిమ్ విత్డ్రాయల్ ప్రక్రియంతా ఎలక్ట్రానిక్ విధానంలో సెటిల్ అవుతుంది. కోవిడ్ సమయంలో అవసరార్థులకు ఆర్థికంగా తక్షణ సాయం అందాలనే లక్ష్యంతో దీన్ని ప్రవేశపెట్టారు.